న్యాల్కల్ (జహీరాబాద్): వ్యవసాయంలో పాత పద్ధతులకు స్వస్తి పలికి అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగుచేస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గి ఆశించిన మేర దిగుబడులు పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అగ్రి హబ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నాబార్డ్, ఎస్బీఐ అరిసా వారి సహకారంతో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని గంగ్వార్ గ్రామంలో డిజిటల్ వ్యవసాయం పైలెట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన రోబోటిక్, డ్రోన్లు, ఆటోమిటిక్ వాతావరణ కేంద్రం, భూమిలో తేమను నిర్ధారించే పరికరాల ఏర్పాటు తదితరాలపై క్షేత్రస్థాయిలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బసంత్పూర్లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...గంగ్వార్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన డిజిటల్ వ్యవసాయ విధానం ఫలితాల ఆధారంగా దశలవారీగా మిగతా ప్రాంతాలకూ విస్తరింపజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ బలరాం, బసంత్పూర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, నాబార్డు డీడీఎం కృష్ణతేజ,గంగ్వార్ సర్పంచ్ సుకుమార్, తదితరులు పాల్గొన్నారు.


