ములుగు(గజ్వేల్): వ్యవసాయ రంగంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ రాజిరెడ్డి అన్నారు. వర్సిటీ పరిధిలోని మొజెర్ల కళాశాల హార్టికల్చర్ తుది సంవత్సరం విద్యార్థులు మండలంలోని క్షీరసాగర్లో సర్పంచ్ కె.బాల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రైతు సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయం తరఫున గ్రామాన్ని దత్తత తీసుకుని సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలతో కలిసి టెక్నాలజీ సెంటర్ స్థాపిస్తామన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు రైతులకు సాగు పద్ధతులను, పంట నమూనాలను అధ్యయనం చేసి, తక్కువ మోతాదులో రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగించాలని వివరించారు. పురుగు మందుల పిచికారీ సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ స్వర్ణకుమారి, ఉప సర్పంచ్ రమేశ్, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి


