ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి
కాపాడబోయిన
బావకు తీవ్ర గాయాలు
హత్నూర (సంగారెడ్డి): ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తికి మూర్చ రావడంతో అదే వాహనం కిందపడి మృతి చెందాడు. కాపాడబోయిన మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై శ్రీధర్ రెడ్డి కథనం ప్రకారం... రెడ్డి ఖానాపూర్ గ్రామానికి చెందిన దుర్గయ్య గ్రామ శివారులో కౌలుకు వ్యవసాయ భూమిని తీసుకొని సాగు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ట్రాక్టర్ కేజీవీల్ నడపడానికి సొంత బామ్మర్ది అయిన నవపేట గ్రామానికి చెందిన సమ్మయ్య (40) ను తీసుకొచ్చాడు. ఈ క్రమంలో పొలం దున్నుతున్న క్రమంలో ఒక్కసారిగా సయ్యకు మూర్ఛ వ్యాధి వచ్చింది. ట్రాక్టర్ అలాగే పొలంలో తిరుగుతుండటంతో గమనించిన బావ దుర్గయ్య దానిని ఆపే క్రమంలో సమ్మయ్య కేజీవీల్ కిందపడి మృతి చెందాడు. కాగా కాపాడే ప్రయత్నం చేసిన దుర్గయ్యకు కూడా కాళ్లపై నుంచి కేజీవీల్స్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ శ్రీధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


