కౌడిపల్లిలో సామాజిక తనిఖీ
రూ.1.25లక్షలు రికవరీ, రూ.16వేలు జరిమాన
కౌడిపల్లి(నర్సాపూర్): ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజాదర్బార్లో అవకతవకలకు పాల్పడిన వారికి అధికారులు రివకరీతోపాటు, జరిమాన వేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో 1ఏప్రిల్, 2024 నుంచి 31మార్చి, 2025 వరకు ఉపాధిహామీ, పంచాయతీ రాజ్, అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.9,98 కోట్లతో చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృంద గ్రామాల్లో తనిఖీ చేసింది. మంగళవారం కౌడిపల్లి రైతువేదికలో సామాజిక తనిఖీ ఏర్పాటు చేయగా ఏపీడీ రంగాచారి, జిల్లా విజిలెన్స్ అధికారి శ్రీహరి, హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్రెడ్డి, జేక్యూసీ అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి డీఆర్పీలు గ్రామాల వారీగా తనిఖీ చేసిన నివేదికను ప్రజాదర్బార్లో పంచాయతీ కార్యదర్శులు, టీఏ, ఫీల్డ్అసిస్టెంట్ల సమక్షంలో అధికారులకు చెప్పారు. అనంతరం అవకతవకలను గుర్తించిన అధికారులు రూ.1,25,491 రికవరీతోపాటు రూ.16వేలు జరిమాన విధించినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ పుణ్యదాస్ తెలిపారు. ఉపాధిహామి పనుల్లో పారదర్శకతకు సామాజిక తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఏపీడీ రంగాచారి తెలిపారు. ఇదిలా ఉండగా మండలంలోని దేవులతండాలో రైతు కొర్ర శ్రీను తనపొలంలో పాంపాండ్ పనులు సగం మాత్రమే చేశారని ఫిర్యాదు చేశారు. పనులు పూర్తి చేశామని టీఏ, తండావాసులు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఓ పుణ్యదాస్, ఈసీ ప్రేమ్ కుమార్, ఎస్ఆర్పీ పాండురంగారావ్, డీఆర్పీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.


