
బాల్యంపై పుస్తకాల భారం
తూప్రాన్: బాల్యంపై పుస్తకాల భారం పడుతుంది. శక్తికి మించిన బరువును మోయలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు లెక్కలేని పుస్తకాల బరువు మోపి ఆదాయం దండుకుంటుంటే, చిన్నారులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. లేలేత భుజాన బస్తాలు మోసినట్లు పుస్తకాల బ్యాగులను మోస్తూ కార్పొరేట్ స్కూళ్లలో నాలుగైదు అంతస్తులు మెట్లు ఎక్కేందుకు ఆపసోపాలు పడుతున్నారు. వయసుకు మించిన బరువు మోస్తే వారి వెన్నెముక దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉదయాన్నే పుస్తకాల బ్యాగును భుజాన వేసుకొని లంచ్బాక్స్ చేత పట్టుకొని పాఠశాలకు హుషారుగా వెళ్లే పిల్లలు సాయంత్రమయ్యేసరికి నీరసంగా ఇంటికి వస్తున్నారు. ప్రతి విద్యార్థి తన బరువులో ఎనిమిదో వంతు బరువు మోయాలని వైద్యులు చెబుతున్నారు. కానీ విద్యార్థులు తన బరువుకంటే 15నుంచి 20శాతం అధికంగా మోస్తున్నారు. ఐదేళ్ల నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు అధిక బరువు మోయరాదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. సొంత సెలబస్, స్మార్ట్ క్లాసులు, రివిజనల్ టెస్టుల పేరుతో అధిక పుస్తకాలను విద్యార్థులకు అంటకడుతూ ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు విధిగా సర్కారు ముద్రించిన పాఠ్యపుస్తకాలతోనే విద్యార్థులకు బోధన చేయాలని సూచిస్తున్నాయి.
అనవసరమైన పుస్తకాలే ఎక్కువ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు ఆరు పాఠ్య, నోట్ పుస్తకాలు, మరో నాలుగు పుస్తకాలు ఉంటాయి. కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఇందుకు విరుద్ధంగా పరిస్థితి కనబడు తోంది. ఒకటవ తరగతి చదివే విద్యార్థికి సాధారణంగా 16 పుస్తకాలు ఉండాలి. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి 32 నుంచి 34 పుస్తకాలు ఉంటున్నాయి.
తరగతుల వారీగా పుస్తకాలు, బరువు
ఒకటో తరగతికి 14పుస్తకాలు, బరువు 6కిలోలు, 2వ తరగతికి 16పుస్తకాలు, 7కిలోలు, 3వ తరగతికి 18 పుస్తకాలు, 9కిలోలు, 4వ తరగతికి 21పుస్తకాలు, 12కిలోలు, 5వ తరగతికి 25 పుస్తకాలు, 14కిలోలు ఉండాలి. 6వ తరగతికి 28 పుస్తకాలు, 16కిలోలు, 7వ తరగతి 31పుస్తకాలు, బరువు 18కిలోలు, 8,9,10వ తరగతులకు 38పుస్తకాలు 20నుంచి 25కిలోల బరువు నిర్దేశించారు.
జిల్లాలో మొత్తం
ప్రైవేటు పాఠశాలలు 105
ప్రైవేటు విద్యార్థులు 40,584
ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలే ఉండాలి
ప్రభుత్వ సిలబస్ను కాదని సొంత సిలబస్ పేరుతో విద్యార్థులతో ఇష్టారాజ్యంగా కొనుగోలు చేయించడం నిబంధనలకు విరుద్ధం. పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ గుర్తింపు పొందిన విక్రయ దుకాణాల్లో కొనుగోలు చేయాలి. ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు చేపడుతాం. విద్యాసంస్థలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చిన పక్షంలో వారు ఫిర్యాదు చేస్తే సదరు పాఠశాలపై చర్యలు తీసుకుంటాం.
–రాధాకృష్ణ, జిల్లా విద్యాధికారి, మెదక్
విద్యార్థులకు పెరుగుతున్న బ్యాగుల మోత
నిర్దేశించిన పుస్తకాలు కొనాల్సిందేనని ఒత్తిడి
వయసుకు మించిన బరువు ఎదుగుదలకే ఆటంకం
ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం
అధిక పుస్తకాలతో అనర్థాలు
విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల నడుము, వెన్ను, కండరాల నొప్పికి గురవుతారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. చదువుపై దృష్టి సారించలేకపోతారు. జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. సమయానికి ఆకలి వేయదు. పుస్తకాలను చూడగానే ఆందోళనకు గురవుతారు. పాఠశాలకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత అసహనానికి లోనవుతారు.
–డాక్టర్ అమర్సింగ్,
సీహెచ్సీ సూపరింటెండెంట్, తూప్రాన్

బాల్యంపై పుస్తకాల భారం

బాల్యంపై పుస్తకాల భారం