
ఢిల్లీ సెమినార్కు ఉపాధ్యాయుడు ఎంపిక
చేర్యాల(సిద్దిపేట): ఈ నెల 24, 25వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అడ్వాన్సుడ్ శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాల సెమినార్ నిర్వహించనున్నారు. ఈ సెమినార్కు మెంటర్గా మండలంలోని ఆకునూరు జెడ్పీహెచ్ఎస్లో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాస రవీందర్ ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి 10 మంది ఎంపికవగా అందులో చేర్యాల ప్రాంతానికి చెందిన రవీందర్ ఒకరు. ఈ అరుదైన గౌరవం ఆయనకు దక్కడం పట్ల పాఠశాల హెచ్ఎం ఎం.ఐలయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ సైదా బేగం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడిని అభినందించారు.
స్కూల్ బస్సు సీజ్
నిజాంపేట(మెదక్): ఫిట్నెస్ లేని కారణంగా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీశంకర స్కూల్కు చెందిన బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. స్కూల్ బస్సులు కండీషన్తోపాటు అన్ని ధ్రువ పత్రాలు ఉండాలని వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు. బస్సుతోపాటు ఆటోను కూడా సీజ్ చేశారు. ఈ మేరకు సీజ్ చేసిన వాటిని పోలీస్స్టేషన్కు తరలించారు.
విధులకు ఆటంకం..
కేసు నమోదు
హవేళిఘణాపూర్(మెదక్): విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు చేస్తున్న పోలీసులపై దుర్బాషలాడిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు మెదక్ రూరల్ ఎఎస్ఐ దయానంద్ శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి మెదక్ మండల పరిధిలోని మంభోజిపల్లి వద్ద డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా మాచవరం గ్రామానికి చెందిన కట్ట యాదగిరి, టేక్మాల్ కుమార్ మద్యం తాగి వాహనం నడుపుతుండటంతో పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగినట్లు తేలడంతో వాహనాన్ని పోలీస్స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాచవరం గ్రామానికి చెందిన యాదగిరి, శేఖర్లతోపాటు, కొందరు పోలీసు సిబ్బంది వాహనం తాళాలు లాక్కొని, మీ సంగతి చెబుతామంటూ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కొల్చారం(నర్సాపూర్): తొమ్మిది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని వరిగుంతం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఓనమాల నాగభూషణం(33) కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 12న తన టీవీఎస్ ఎక్సెల్పై మెదక్ నుంచి వస్తున్నాడు.అప్పాజీపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ నాగభూషణం ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది.దీంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో, చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేస్తు దర్యాప్తు చేస్తున్నారు.
మూర్ఛ వ్యాధితో..
పటాన్చెరు టౌన్: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఇస్నాపూర్కు చెందిన నవీన్ (25) కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న నవీన్ శుక్రవారం నైట్ డ్యూటీకి వెళ్తున్నానని చెప్పాడు. శనివారం ఇస్నాపూర్ వాక్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో రామ్ రాజ్ షాపింగ్ మాల్ ముందు మృతి చెంది కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అనారోగ్యం కారణంగా తమ కుమారుడు మృతి చెంది ఉండవచ్చని, మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
సిద్దిపేటఅర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం... సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన గంగాధరి గణేష్ (17) తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 11న ద్విచక్ర వాహనంపై స్వగ్రామం నుంచి సిద్దిపేటకు వస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన గణేష్ను హైదరాబాద్ నిమ్స్కు తరలించగా బ్రెయిన్ డెడ్ అయి చికిత్సకు సహకరించకపోవడంతో 16వ తేదీన సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

ఢిల్లీ సెమినార్కు ఉపాధ్యాయుడు ఎంపిక