ఇడ్లీ పిండి కూడా షాపు నుంచే! | Recent trends in ready to eat and cook food products | Sakshi
Sakshi News home page
breaking news

ఇడ్లీ పిండి కూడా షాపు నుంచే!

Jun 10 2025 4:51 AM | Updated on Jun 10 2025 4:51 AM

Recent trends in ready to eat and cook food products

మారుతున్న వినియోగదారుల ధోరణి

రెడీ టు కుక్‌ కూరలవైపు మొగ్గు

56 గంటలకు ఒకసారి దుకాణానికి

చిన్న ప్యాక్‌ల వైపు కస్టమర్ల ఆసక్తి

పెరిగిన అన్ బ్రాండెడ్‌ ఉత్పత్తుల సేల్స్‌

‘కాంటార్‌ ఎఫ్‌ఎంసీజీ పల్స్‌’నివేదిక

ఇడ్లీలు, దోసెల వంటి అల్పాహారం కోసం కావాల్సిన పిండిని  ఇంట్లోనే రుబ్బి తయారు చేసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా దుకాణం నుంచి కొని తెచ్చుకునేవారి సంఖ్య పెరిగింది. రెడీమేడ్‌ పిండి కొనుక్కోవడం ఎప్పటి నుంచో ఉంది. ఇదేం కొత్త విషయం కాదంటారా? నిజమే.. రుబ్బిన పిండి వంటి రెడీ టు కుక్‌ మిశ్రమాలను గడిచిన రెండేళ్లలో కొత్తగా 1.8 కోట్ల కుటుంబాలు కొనుగోలు చేయడమే ఇక్కడ సరికొత్త విషయం. అంతర్జాతీయ పరిశోధన సంస్థ కాంటార్‌ ‘ఎఫ్‌ఎంసీజీ పల్స్‌’ నివేదికలో ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఇంటికి కావాల్సిన సరుకుల కోసం భారతీయులు ఒక ఏడాదిలో దుకాణాలకు 156 సార్లు వెళ్లారట. అంటే 56 గంటలకు ఒకసారి లేదా ప్రతి రెండు రోజులకోసారి సరుకులు కొనుగోలు చేశారని కాంటార్‌ తన ‘ఎఫ్‌ఎంసీజీ పల్స్‌’ నివేదికలో వెల్లడించింది. 2023–24లో సైతం భారతీయులు ఇదే స్థాయిలో షాపింగ్‌ చేశారని తెలిపింది. అంతేకాదు, వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం, కొనుగోలు చేసిన ఉత్పత్తుల సంఖ్య పెరిగిందని వివరించింది. 2025 జనవరి–మార్చి కాలంలో ఫాస్ట్‌ మూవింగ్‌ కంజ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) అమ్మకాల్లో 3.5% వృద్ధి  నమోదైంది.

అన్ బ్రాండెడ్‌ హవా..
స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన 22 కంపెనీల పరిమాణ వృద్ధి రేటు కేవలం 3.6% మాత్రమే. కానీ, ప్రముఖ కంపెనీలవి కాని అన్ బ్రాండెడ్‌ ఉత్పత్తులు ఏడాదిలో 6.1% వృద్ధి సాధించాయి. 2023–24తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుడు కొనుగోలు చేసిన సగటు ప్యాక్‌ పరిమాణం 16% పెరిగింది. అంటే పావుకిలో బదులు అరకిలో.. అరకిలో బదులు కిలో ఇంటికి తెచ్చుకున్నారన్న మాట. అలాగే ప్యాక్‌ల సంఖ్య 13% పెరిగింది. 2023–24లో వినియోగదార్లు సగటున 200 ప్యాక్‌లు కొనుగోలు చేస్తే.. 2024–25కు వచ్చే సరికి ఇది 226కి చేరింది.

సరుకుల కోసం ఒక ఏడాదిలో 156 సార్లు వెళ్లారు. అంటే 56 గంటలకోసారి అన్నమాట.
ప్యాక్‌ సైజు 16 శాతం, ప్యాక్‌ల సంఖ్య 13 శాతం పెరిగింది.

జాతీయ సగటుతో పోలిస్తే దక్షిణ ఢిల్లీ వాసుల ఎఫ్‌ఎంసీజీ వినియోగం రెండింతలు అధికం.
పశ్చిమ ఢిల్లీవాసులు గరిష్టంగా ఏటా రూ.39,325 ఖర్చు చేశారు.
వ్యయాల పరంగా నైరుతి బెంగళూరు ప్రీమియం ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌గా నిలిచింది.

వాషింగ్‌ లిక్విడ్స్‌..
దుస్తులు ఉతికేందుకు వాడే సబ్బుల అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. సబ్బులకు బదులు కస్టమర్లు లిక్విడ్స్‌ను ఎంచుకుంటున్నారు. ఎఫ్‌ఎంసీజీ రంగంలో వాషింగ్‌ లిక్విడ్స్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా అవతరించాయి. రెండు ఆర్థిక సంవత్సరాల్లో వీటి పరిమాణం 2.7 రెట్లు దూసుకెళ్లింది. వాషింగ్‌ లిక్విడ్స్‌ కొనుగోలు చేస్తున్న గృహాల సంఖ్య 2022–23 నుంచి కొత్తగా 2.4 కోట్లు పెరిగింది. 20 శాతం కుటుంబాలే దేశంలో వీటిని వినియోగిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. గత 5 ఏళ్లలో దేశంలో వాషింగ్‌ మెషీన్ల అమ్మకాలు పెరగడమే.

అంతా రెడీమేడ్‌..
రెడీ–టు–కుక్‌ మిశ్రమాల అమ్మకాలు రెండింతలై కొత్తగా 1.8 కోట్ల కుటుంబాలకు ఇవి చేరాయి. ప్రధానంగా దోసె, ఇడ్లీల తయారీకి వాడే రుబ్బిన పిండ్లు ఎక్కువగా కొంటున్నారు. రెడీ–టు–కుక్‌ కూరలను నూతనంగా 6 లక్షల గృహాలు  ఆస్వాదించాయి. మ్యూస్లీ, పొరిజ్, ఓట్స్‌తో తయారైన అల్పాహార ఉత్పత్తులు రెండు సంవత్సరాలలో 1.5 రెట్లు వృద్ధి చెందాయి. కార్బోనేటేడ్‌ శీతల పానీయాలు, పండ్ల రసాలు, పాల ఆధారిత పానీయాలు, చాక్లెట్స్, బిస్కెట్స్, సాల్టీ స్నాక్స్, ఐస్‌ క్రీమ్స్‌ వంటి ఉత్పత్తుల విక్రయాలు 2.4% పెరిగాయి. బిస్కెట్స్‌ వినియోగం ఇంటి వెలుపల తగ్గితే, ఇళ్లలో పెరిగింది.

చిన్న ప్యాక్‌లవైపు..
దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో 10–40 లక్షల మధ్య జనాభా ఉన్న మినీ మెట్రో పట్టణాల్లో.. వినియోగ వస్తువులు, ఇతర విభాగాల ధరల పెరుగుదల, వేతన వృద్ధి స్తబ్ధుగా కొనసాగుతుండడం కొనుగోళ్లను తగ్గిస్తోంది. దుకాణాలకు వెళ్తున్న  సంఖ్యలో మార్పు లేనప్పటికీ చిన్న, మరింత చవకైన ప్యాక్‌ పరిమాణాల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. అంటే ధరను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటున్నారన్నమాట. ఇక 2024–25లో సూపర్‌ మార్కెట్స్‌లో అమ్మకాల పరిమాణం 43% ఎగిసింది. కిరాణా దుకాణాల వ్యాపారం మాత్రం స్థిరంగా ఉంది. 

పట్టణ మార్కెట్లు మెరుగ్గా..
పట్టణ మార్కెట్లు 2025 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.4% వృద్ధిని సాధించగా,  గ్రామీణ మార్కెట్లు 2.7% పెరిగాయి. పట్టణ మార్కెట్‌.. గ్రామీణ ప్రాంతాల కంటే వేగంగా వృద్ధి చెందడం ఇది వరుసగా మూడో త్రైమాసికం. చాలా లిస్టెడ్‌ కంపెనీల అమ్మకాల్లో పట్టణ మార్కెట్ల నుంచి 50–70% సమకూరుతోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉండటం, ఇంటి అద్దెలు పెరగడం గత సంవత్సరంలో పట్టణాల్లో రోజువారీ కిరాణా, ప్రధాన వస్తువుల డిమాండ్‌పై ప్రభావం చూపాయి.

హిందూస్తాన్‌ యూనిలీవర్, గోద్రెజ్‌ కంజ్యూమర్‌ ప్రొడక్ట్స్, టాటా కంజ్యూమర్‌ ప్రొడక్ట్స్, మారికో వంటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. వాటి అమ్మకాల్లో పెరుగుదల గరిష్ఠంగా 7 శాతాన్ని మించలేదు. ఖరీదైన వస్తువులు, పెద్ద ప్యాక్‌ల వైపు కస్టమర్లు ఆకర్షితులవుతున్నందున రాబోయే రోజుల్లో పట్టణ ఎఫ్‌ఎంసీజీ రంగంలో బలమైన వృద్ధి కనిపించే అవకాశం ఉందని కాంటార్‌ నివేదిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement