సాక్షి, రంగారెడ్డిజిల్లా: మృగశిరకు ముందే ఉమ్మడిజిల్లాను తొలకరి పలకరించింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షానికి వాతావరణం చల్లబడింది. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 5.03 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 4.43 సెంటీమీటర్లు నమోదైంది. శేరిలింగంపల్లిలో 4.08 సెం.మీ, కందుకూరులో 3.80 సెం.మీ, యాచారం మండలం నల్లవెల్లిలో 3.75 సెం.మీ, కడ్తాల్ మండలం ముద్వీన్లో 3.68 సెం.మీ, కొంగర కలాన్లో 3.38 సెం.మీ, మామిడిపల్లిలో 3.13 సెం.మీ, మణికొండలో 2.72 సెం.మీ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ చౌడాపూర్లో 3.68 సెం.మీ, మదన్పల్లెలో 2.80 సెం.మీ, యాలాలలో 2.65 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ లైన్లపై పడ్డాయి. వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్ప డింది. విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమైన సరఫరాను పునరుద్ధరించారు. మరోవైపు వర్షం ధాన్యం రైతులను నిండా ముంచింది. రాశులపై టార్పాలిన్లు లేకపోవడంతో తడిసి ముద్దయ్యాయి.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలిచింది. కొంగరకలాన్లో 33.8 మిల్లీమీటర్లు, ఇబ్రహీంపట్నంలో 13.8 మి.మీ. మంగల్పల్లి ప్రాంతంలో 0.8 మి.మీటర్లు వర్షపాతం నమోదైంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం
తాండూరులో 5.03 సెం.మీ వర్షపాతం
మాడ్గులలో 4.43 సెం.మీ నమోదు
ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం


