రాజకీయ కక్షతో సర్పంచ్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్షతో సర్పంచ్‌పై దాడి

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

కొందుర్గు: సర్పంచ్‌పై దాడి జరిగిన సంఘటన జిల్లేడ్‌ చౌదరిగూడు మండలం పద్మారంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మారం శివారులో ఈదమ్మ జాతరలో ఊరేగింపు నిర్వహిస్తుండగా ఓ ఎద్దుల బండి బోల్తా పడింది. దీంతో ఎల్కగూడ సర్పంచ్‌ బందయ్య బండ్లను మెల్లగా తోలండి, దెబ్బలు తగులుతాయని సూచించారు. ఇదే అదునుగా కొందరు యువకులు బందయ్యతో వాదించి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గమనించిన స్థానికులు సర్పంచ్‌ను చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అటునుంచి మెరుగైన చికిత్సకు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా తమ వర్గానికి చెందిన వ్యక్తి సర్పంచ్‌గా ఓడిపోయాడని అక్కసుతో గ్రామానికి చెందిన రాంరెడ్డి వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

ఎమ్మెల్యే పరామర్శ

జాతరలో పాల్గొనేందుకు గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ స్థానికులతో విషయం తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి బందయ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గొడవకు గల కారణాలు తెలుసుకొని, బందయ్యపై దాడి చేసిన నిందితులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement