ఆమనగల్లు: భౌతిక జీవితం నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో నడిచే పవిత్రమైన జీవన విధానమే సన్యాసమని వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరిస్వామి అన్నారు. పట్టణంలోని శ్రీ రామదూత ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శివానందస్వామి నేతృత్వంలో వివిధ ఆశ్రమ పీఠాధిపతుల సమక్షంలో బుధవారం పలువురు సన్యాసం స్వీకరించారు. సన్యాసం స్వీకరించిన వారికి పీఠాధిపతులు కాషాయ దుస్తులు అందించడంతో పాటు మంత్రోపదేశం చేశారు. వేదమంత్రాలు, యజ్ఞాలు నిర్వహించగా పలువురు పీఠాధిపతుల సమక్షంలో కుటుంబ సభ్యుల భావోద్వేగాల మద్య పలువురు సన్యాసం స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఆశ్రమ పీఠాధిపతులు మాట్లాడుతూ.. లోకబందనాలను విడిచిపెట్టి పరమాత్మ సాధనలో నిమగ్నం కావడమే సన్యాసమని అన్నారు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్తం తరువాత సన్యాసం చివరిదశ అని వివరించారు. సన్యాసం స్వీకరించే వారు అహంభావాన్ని విడిచి పరమసత్యాన్ని అన్వేషించే దిశగా అడుగులు వేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా రామదూత ఆశ్రమం వ్యవస్థాపకులు శివానందస్వామిని భక్తులు తులాభారం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆశ్రమాల పీఠాధిపతులు పరిశుద్దానందస్వామి, శంకరానందగిరిస్వామి, పరవిద్యానందగిరిమాతాజీ, రామకృష్ణానందగిరిస్వామి, ఆత్మానంద గిరి మాతాజీ, మల్లికార్జుజనానందగిరిస్వామి, కృష్ణనందగిరిస్వామి, భక్తులు వీరబొమ్మ రామ్మోహన్, నర్సింహ, యాదయ్య, శ్రీహరి, రమేశ్, యాదయ్య, లక్ష్మయ్య, కృష్ణయ్య, మల్లయ్య, చంద్రశేఖర్, సత్యం, వెంకటాచారి, యుగందరరెడ్డి, భరతయ్య తదితరులు ఉన్నారు.
వ్యాసాశ్రమం పీఠాధిపతికి సత్కారం
పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిపూర్ణానందగిరి స్వామిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమాండ్ల నర్సింహ, సభ్యులు నటరాజ్ యాదయ్య, అర్థం లక్ష్మయ్య, శ్రీ రామదూత ఆశ్రమం వ్యవస్థాపకులు శివానందస్వామి తదితరులు పాల్గొన్నారు.
వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరిస్వామి


