బస్సులు లేక ఇబ్బంది
ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ అద్దె బస్సులు నడిచాయి. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో 137 బస్సులకు గాను 61 అద్దె బస్సులను అధికారులు నడిపించారు. డిపోలో సుమారు 800 మంది సిబ్బందికిగాను సుమారు 580 మంది సమ్మెలో పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఉదయం డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. కార్మికులకు మద్ధతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆ సంఘం నాయకులు ఎల్లేశ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు పనిబారం తగ్గించాలని, పేస్కేల్ అములు చేయాలని, ఆర్టీసీ ఆస్తులను కాపాడి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జగన్, యాదగిరి, డిపో జేఏసీ చైర్మన్ సీహెచ్ యాదగిరి, అబ్దుల్ రజాక్, జంగయ్య, నర్సింహ, లలిత, కల్పన, కార్మికులు పాల్గొన్నారు. బస్సు సౌకర్యం లేక పలువురు ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. వారు భారీగా చార్జీలు పెంచారు.
ఆర్టీసీ సమ్మెతో సకాలంలో బస్సులు రాక ఇబ్బందులు పడ్డాం. గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాం. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– దీపిక, ప్రయాణికురాలు


