ఇబ్రహీంపట్నం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఇబ్రహీంపట్నం మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మండుటెండల్లో కూలీలు కష్టపడుతున్న ఫలితం దక్కడంలేదు. చేసిన ఉపాధి పనికి వెంటనే కూలీ డబ్బులు పడకపోవడంతో శ్రమజీవులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 5,460 జాబ్ కార్డులుండగా ప్రతి నిత్యం 850 నుంచి 950 మంది కూలీలు పనులకు వెళుతున్నారు. ఊట చెరువులు, ఫీడర్ చానల్ కాలువ తవ్వకాలు, చిన్న నీటి కుంటలు, ఫాంపాండ్స్, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ తదితర పనులు కూలీలు చేస్తున్నారు. పది వారాలుగా కూలీలకు డబ్బుల చెల్లింపులు కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. చేసిన కష్టానికి వెంటనే డబ్బులు రాక వారాల తరబడి ఎదురు చూపులే దిక్కాయ్యాయి. అంతేగాక పని ప్రదేశంలో ఫేస్ రికగ్నైజెషన్ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తుండటంతో నెట్ వర్క్ సమస్యలు తలెత్తున్నాయి.


