న్యూస్రీల్
టెంట్ లేదు.. నీళ్లు లేవు
కందుకూరు: మండలంలోని ముచ్చర్ల పరిధిలో మంగళవారం ఉపాధిహామీ కూలీలు వాగులో పూడికతీత పనులు చేపట్టారు. మొత్తం 109 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. పని చేసే ప్రదేశంలో తాగునీరు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలాంటివి ఏమీ ఏర్పాటు చేయలేదు. కూలీలే ఇళ్ల వద్ద నుంచి తాగునీరు సీసాల్లో తెచ్చుకున్నారు. మండుటెండలోనే పనులు చేస్తున్నారు. సమీపంలోని చెట్ల నీడనే సేదతీరాల్సిన పరిస్థితి. మరోవైపు పిబ్రవరి 3 నుంచి ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించిన డబ్బులు బకాయిలు ఉన్నాయని కూలీలు తెలిపారు. సకాలంలో కూలీ డబ్బు రాక ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోయారు.
పని ప్రదేశంలో కరువైన సౌకర్యాలు
తాగునీరు, నీడ ఏర్పాట్లు నిల్
నిబంధనలు పట్టని అధికారులు
ఇబ్బందులు పడుతున్న కూలీలు
భానుడు భగభగ మండిపోతున్నాడు.. ఎండలు దంచి కొడుతున్నాయి.. తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.. బయటికి వెళ్లాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది.. ఉపాధి కూలీలు మాత్రం ఎండలోనే చెమటోడుస్తున్నారు.. పనిచేసే చోట కనీస సౌకర్యాలు కరువయ్యాయి.. పొట్టకూటి కోసం అవస్థలు పడుతున్నారు..
ఎండలోనే పనులు చేయాలి. కనీసం టెంట్ లేదు, నీళ్లు కూడా లేవు. ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం. రెండుసార్లు హాజరు కోసం ఫొటోలు తీస్తున్నారు. ఒక్కోసారి రావడంలేదు, ఇబ్బందిగా ఉంది. వాటిని తొలగించాలి. మూడు నెలల నుంచి కూలీ డబ్బు ఇవ్వడం లేదు. వారం వారం అందేలా చూడాలి. – తేరటి పార్వతమ్మ, ఉపాధి కూలీ, ముచ్చర్ల


