షాద్నగర్రూరల్: మహిళాసంఘం భవన నిర్మాణానికి గ్రామంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలన చేయాలని డీపీఓ సురేష్మెహన్ ఎంపీఓ జయంత్రెడ్డిని ఆదేశించారు. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని హజిపల్లి, ఎలికట్ట పంచాయతీలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం, డంపింగ్యార్డు, శ్మశానవాటికలను పరిశీలించారు. ఎలికట్టలో మహిళాసంఘం భవనానికి అధికారులు స్థలాన్ని కేటాయించారని, కొందరు గ్రామస్తులు భవనం కట్టకుండా అడ్డుకుంటున్నారని మహిళాసంఘం సభ్యులు ఈ నెల 16న నిర్వహించిన మండలస్థాయి సమావేశానికి హాజరైన పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ దివ్యదేవరాజన్ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆమె సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న డీపీఓ, ఎంపీడీఓ బన్సీలాల్ను ఆదేశించారు. ఈ క్రమంలో ఎలికట్టను సందర్శించిన డీపీఓ సురేష్మోహన్ మహిళాసంఘం భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి త్వరలోనే నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీఓకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తేజస్విని, అనూష, కారోబార్ శివ తదితరులు పాల్గొన్నారు.


