షాద్నగర్: ప్రతి ఒక్కరూ పౌష్టిక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు సూచించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని చించోడ్ పీహెచ్సీలో పౌష్టికాహారం, వడదెబ్బ నుంచి రక్షణపై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. మహిళలకు ఉచిత వైద్య సేవలు, మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సమీపంలోని వైద్యశాలను సంప్రదించాలన్నారు. రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


