హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్‌

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

అత్తాపూర్‌: హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అత్తాపూర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమూద్‌ అహ్మద్‌ సుమారు 15 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సులేమాన్‌నగర్‌ ప్రాంతంలోని మెట్రో ఫర్నిచర్‌ షాప్‌లో పని చేస్తున్నాడు. మహమూద్‌ పనిలో నిర్లక్ష్యం చేస్తున్నాడని తొలగించి అజీజ్‌ అనే మరో కార్మికుడిని నియమించారు. అప్పటి నుంచి మహమూద్‌ పలుమార్లు షాపు వద్దకు వచ్చి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన వస్తోందని బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం షాపులో ఎవరూ లేని సమయంలో అజీజ్‌పై దాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఐటీ ఉద్యోగి ఖాతా ఖాళీ

ఉప్పల్‌: ఐటీ ఉద్యోగికి ఏపీకే ఫైల్‌ పంపిన సైబర్‌ నేరగాళ్లు రూ.2.60 లక్షలు అతని బ్యాంక్‌ అకౌంట్‌నుంచి స్వాహా చేశారు. ఉప్పల్‌ పోలీసులు తెలిపిన మేరకు.. సెవన్‌ హిల్స్‌ కాలనికి చెందిన సాయి కిరణ్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు విభాగం నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. కొత్త క్రెడిట్‌ కార్డు కోసం వివరాలను ఇవ్వాలని కోరాడు. ఏపీకే ఫైల్‌ పంపి యాప్‌ ద్వారా వివరాలు పూర్తి చేయాల్సిందిగా కోరాడు. యాప్‌ను ఓపెన్‌ చేయగానే అనుమానం వచ్చి కాల్‌ కట్‌ చేసినా కూడా బ్యాంక్‌ ఖాతాలో ఉన్న రూ.2,60,000 ఫిర్యాదు దారునికి తెలియకుండానే ఓటీపీలు చెప్పకుండానే ఖాతా ఖాళీ చేశాడు. దీంతో బాధితుడు ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు.

ట్రేడింగ్‌ పేరిట రూ.12 లక్షలకు టోకరా

కీసర: సైబర్‌ నేరగాళ్లు ట్రేడింగ్‌ పేరిట ఓ వ్యక్తి నుంచి రూ.12.94 లక్షలు దోచేశారు. కీసర పోలీసులు తెలిపిన మేరకు.. కీసర నాగారం సత్యనారాయణ కాలనీకి చెందిన మహేశ్వర్‌గౌడ్‌ ఫోన్‌నెంబరును సైబర నేరగాళ్లు రెండు వాట్సాప్‌ గ్రూప్స్‌లో చేర్చారు. నిరాలి సంఘీ, సుబ్రతా ముఖర్జీ పేరిట మాట్లాడారు. లాభాలు తెప్పిస్తామని..ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాలని నమ్మించారు.వారి మాటలు నమ్మిన బాధితుడు మొబైల్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు.ఆ తరువాత రూ.40 వేలు జమ చేశాడు. అనంతరం రూ.15 వేలు విత్‌ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అది నమ్మిన మహేశ్వర్‌ గౌడ్‌ రూ.12.94 లక్షలు జమచేశాడు. ఆ తరువాత డ్రా చేసుకునేందుకు యత్నించగా మరింత డబ్బు జమచేయాలని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నాటు తుపాకీ విక్రయించేందుకు యత్నం

ఇద్దరి అరెస్ట్‌

కుత్బుల్లాపూర్‌: నాటు తుపాకీ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎస్‌ఓటీ, పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సవవవేశంలో కుత్బుల్లాపూర్‌ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. నాటు తుపాకీ విక్రయిస్తుననారని పోలీసులకు సమాచారం అందింది. దూలపల్లిలోని వికాస్‌ గ్యాస్‌ గోదాము వద్ద నిఘా పెట్టగా అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని ఆదుపులోకి తీసుకొని విచారించగా తుపాకీ విక్రయం వ్యవహారం బయట పడింది. నిందితులు బీహార్‌కు చెందిన వికాస్‌కుమార్‌(22), వంశరాజ్‌(31) గా గుర్తించారు. వీరు స్థానికంగా కూలీలుగా పనిచేచేస్తున్నారు. బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసి సిటీలో విక్రయించాలని ప్లాన్‌ వేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.7.65 ఎంఎం నాటు తుపాకీతోపాటు 8 బుల్లెట్లు, రెండు ఖాళీ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఎవరెవరికి ఆయుధాలను విక్రయించారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement