● మూడు ‘పీఆర్ఎస్ఐ’ అవార్డులు
సాక్షి, సిటీబ్యూరో: జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న జలమండలి.. తాజాగా మరో మూడింటిని తన ఖాతాలో వేసుకుంది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) బహుమతులు మూడు లభించాయి. ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగిన పీఆర్ఎస్ఐ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్లో విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ప్రొఫెసర్ నాగేశ్వర్ కలిసి జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, పీఆర్వో సుభాష్, భూగర్భ జల నిపుణుడు సత్యనారాయణకు అవార్డులను బహూకరించారు. ఓఆర్ఆర్ పరిధిలో భూగర్భ జలాల పెంపునకు అవగాహన కోసం బ్రోచర్ రూపొందించిన జలమండలి.. వివిధ మాధ్యమాల్లో ప్రజలకు అవగాహన కల్పించింనందుకు ప్రథమ, ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్పై రూపొందించిన డాక్యుమెంటరీకి ద్వితీయ, ఇంకుడు గుంతల నిర్మాణంపై రూపొందించిన పోస్టర్కు తృతీయ బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిబ్బందిని అభినందించారు.


