● నేలరాలిన మామిడికాయలు
● విరిగిన విద్యుత్ స్తంభాలు
● సరఫరాకు అంతరాయం
యాచారం: ఈదురు గాలులు, వడగళ్ల వానతో ఆదివారం ఆయా మండలాల్లో తీవ్ర నష్టం జరిగింది. యాచారం మండల పరిధిలోని ధర్మన్నగూడెం, చౌదర్పల్లి, చింతుల్ల తదితర గ్రామాల్లో పలు ఈదురుగాలులతో మామిడికాయలు నేలరాలాయి. ధర్మన్నగూడెం గ్రామానికి చెందిన దోమ జీవన్మయరెడ్డికి చెందిన పది ఎకరాల్లోని తోటలో చెట్లకున్న మామిడికాయలు పూర్తిగా నేలరాలాయి. రూ. లక్షలాది నష్టం రావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
తులేకలాన్లో భారీ వర్షం
ఇబ్రహీంపట్నం రూరల్: అకాల వర్షం ఆగమాగం చేసింది. ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్లో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి గ్రామంలో రెండు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.


