వేసవి కాలం ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కొందరు.. సరదాగా మరికొందరు యువకులు, విద్యార్థులు చెరువులు, వ్యవసాయ బావుల్లో ఈత కోసం వెళ్తున్నారు. యాచారం మండలం తాడిపర్తి, కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి, మంతన్గౌరెల్లి, కొత్తపల్లి, మల్కీజ్గూడం, నందివనపర్తి, నస్దిక్సింగారం గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో ఈత నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పురాతన బావులు కావడంతో అడుగు భాగంలో చెట్ల కర్రలు, రాళ్లు, కంపచెట్లు, లోతు తెలియక ప్రమాదం పొంచి ఉంది. గతంలో తాడిపర్తి కుంటలో ఈతకు వెళ్లి లోతు తెలియక నీట మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.
చర్యలు తీసుకోవాలి
యాచారం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో గతంలో స్టోన్ తీసేందుకు వ్యాపారులు పెద్ద గోతిని తీశారు. పూర్తిగా మూసివేయకపోవడంతో నీళ్లు చేరి అలానే ఉంది. ప్రస్తుతం ఆ క్వారీ గుంతల్లోకి ఈతకు ఎవరూ వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్తే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అవుతుంది. అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


