3
ప్రతిపాదనలు పంపించాం
మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని మున్సిపల్ అధికారులు లేఖరాశారు. చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో అందుబాటులో ఉందని కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించాం. డీసీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు సంబంధించిన లేఖ ఇంకా అందలేదు. లేఖ అందిన వెంటనే కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదిస్తాం.
– గౌతమ్కుమార్, తహసీల్దార్, మొయినాబాద్
ఎకరాలు
మొయినాబాద్: కొత్తగా ఏర్పడిన మొయినాబాద్ పురపాలిక సంఘం, చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూకేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. చిలుకూరు రెవెన్యూలో సర్వేనంబర్ 786లోని ప్రభుత్వ భూమిని కేటాయించనున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్కు పంపారు. ప్రభుత్వం సైతం ఇందుకు సుముఖంగా ఉండడంతో త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ప్రభుత్వ భూమి పరాధీనం కాకుండా..
నగర శివారుల్లోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో ఇందులోని 9 ఎకరాల్లో వేద పాఠశాల ఏర్పాటుకు కేటాయించారు. కానీ వేద పాఠశాల ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వ భూమి ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉన్న భూమి పరులపాలు కాకుండా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విధంగా చేయాలని రెవెన్యూ అధికారులు చర్యలు మొదలు పెట్టారు.
కలెక్టర్కు ప్రతిపాదనల నివేదిక
మొయినాబాద్ మున్సిపాలిటీ ఏడాది క్రితం ఏర్పడింది. మొయినాబాద్, చిలుకూరు, పెద్దమంగళారం, అప్పోజీగూడ, సురంగల్, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్నగర్, హిమాయత్నగర్ పంచాయతీలను విలీనం చేసి మొయినాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయానికి సరైన భవనం లేకపోవడంతో అజీజ్నగర్ పంచాయతీ కార్యాలయంలోనే మున్సిపల్ కార్యాలయాన్ని తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో పాలకమండలి ఏర్పడింది. చైర్పర్సన్ కార్యాలయం, వైస్చైర్మన్, కౌన్సిలర్లు కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. కొత్త మున్సిపల్ కార్యాలయం ఏర్పాటుకు సుమారు 3 ఎకరాల స్థలం కేటాయించాలని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. దీంతో చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందని రెవెన్యూ అధికారులు గుర్తించారు. కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయం తాత్కాలికంగా మొయినాబాద్లోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో కొనసాగుతోంది. డీసీపీ కార్యాలయం ఏర్పాటుకు సైతం స్థలం కావాలని పోలీసు శాఖ కోరడంతో రెవెన్యూ అధికారులు చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 786లో 3 ఎకరాలు కేటాయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ కార్యాలయం, డీసీపీ కార్యాలయానికి 3 ఎకరాల చొప్పున భూకేటాయింపులకు సంబంధించిన పూర్తి ప్రతిపాదనల నివేదికను రెవెన్యూ అధికారులు కలెక్టర్కు పంపించనున్నారు.
ప్రభుత్వం సైతం సానుకూలం
మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయం, చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉంది. మొయినాబాద్లోని విలువైన భూములను కాపాడే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. చిలుకూరు రెవెన్యూలోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించుకోవడమే మంచిదని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా భూకేటాయింపుకు అనుమతిస్తూ నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
చిలుకూరు రెవెన్యూలో
భూ కేటాయింపులు
ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
త్వరలో వెలువడనున్న ఉత్తర్వులు


