హోటల్లో అధికారుల తనిఖీలు
● మహిళా అధికారిపై దురుసుగా
ప్రవర్తించిన యాజమాన్యం
● ఇబ్రహీంపట్నం ఠాణాలో ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం రూరల్: సాహస్ అర్బన్ డైన్ ఇన్ హోటల్లో ఆదిబట్ల సర్కిల్ శానిటేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటల్ యజమానులు మహిళా అధికారి విధులకు ఆటంకం కల్గించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగిని ఇబ్బందులకు గురి చేసి ఫోన్ లాగేసుకున్నారని ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని మంగళ్పల్లిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఆదిబట్ల సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్గా చేస్తున్న ఎన్.వనిత శనివారం మంగళ్పల్లి గేటు వద్ద ఉన్న సాహస్ అర్బన్ డైన్ ఇన్ హోటల్లోని కిచెన్ పరిశీలించారు. బిర్యాని హండీని పరిశీలించి రంగులు వేసి ఆహారం తయారు చేసినట్లు గుర్తించారు. ఇలా చేయడం నేరమని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హండీ పడేశారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై ఆగ్రహించారు. ఆహారం రుచికరంగా ఉండేందుకు టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. శుభ్రత పాటించడం లేదని హెచ్చరించారు. దీంతో యాజమాన్యం ఫోన్లో అధికారిని వీడియోలు తీశారని, మీరు అధికారులు కాదని ఇలా చేయడం తగదని బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.


