బీసీ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పక్కగా అమలు చేయాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి జిల్లా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీఆర్ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి వెంటనే అమలు చేయాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకుడు అబ్దుల్ రెహమాన్, జిల్లా కన్వీనర్ శేఖర్ చారి, నాయకులు తులసిగారి రవీందర్, జానకమ్మ, భవాని శేఖర్, అమరేందర్, స్టాలిన్, నర్సింహ, మహేశ్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
హుడాకాంప్లెక్స్: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి యువకళాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వర్ రావు మంగళవారం ఒక ప్రటకనలో పేర్కొన్నారు. సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో ఈనెల 17న ఉదయం 9 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు జానపద సంగీతం, జానపద నృత్యం, కథారచన, పెయింటింగ్, వక్తృతం, కవిత్వం తదితర పోటీలకు ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. అభ్యర్థులు 15 నుంచి 29 ఏళ్ల లోపువారై ఉండాలన్నారు. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన కళాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని, రాష్ట్రస్థాయిలో ఎంపికై న వారు జనవరి 10న న్యూఢిల్లీలో జరిగే 29వ జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనేందుకు అవకాశం పొందుతారని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 15వ తేదీ లోపు తమ వివరాలను dysorangareddy@gmail.com ఈ మెయిల్ ద్వారా లేదంటే సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో నేరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 9849909077 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
నందిగామ: మహిళా సంఘాలు బలోపేతం కావడానికి పంచసూత్రాలను విధిగా పాటించాలని సెర్ప్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ స్వర్ణలత అన్నారు. మండల కేంద్రంలోని మండల మహి ళా సమాఖ్య భవనంలో మంగళవారం ఏపీఎం భగవంతు ఆధ్యక్షతన సీనియర్ సీఆర్పీలు, సభ్యులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. పంచసూత్రాలైన ప్రతీ నెల సమావేశాలు నిర్వహించుకోవడం, పొదుపు చేసుకోవడం, అప్పు ఇచ్చుకోవడం, ఇచ్చిన అప్పులను సకాలంలో వసూలు చేయడం, పుస్తకాలు రాసుకోవడం తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. 15 నుంచి 18 ఏళ్ల బాలికలను గుర్తించి కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని, వీటితో పాటు దివ్యాంగుల సంఘాలు, వృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఆర్పీలు హైమావతి, కావేరి, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కడ్తాల్: మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఇంటర్ బోర్డు అధికారి శశిధర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా తరగతి గదులు, పరిసరాలు, వంటగది, స్టోర్ రూమ్ను బృందం సభ్యులు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి అందుతున్న వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, రికార్డ్స్, యూ డైస్, డేటా ఎంట్రీ, టోటల్ అడ్మిషన్స్, ఎఫ్ఆర్ఎస్, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల అధ్యాపకులతో సమావేశమయ్యారు. పాఠ్య ప్రణాళికను సకాలంలో పూర్తి చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ అనిత, పీజీ సీఆర్టీలు ఉన్నారు.


