‘యాప్’సోపాలు తొలగేనా!
యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలి
● యాప్లోనే యూరియా బుకింగ్ ● కొందరికి స్మార్ట్ఫోన్లు కరువు ● మరికొందరికి అవగాహన లేక తిప్పలు ● ఇప్పటికీ చదువురాని రైతులే అధికం
సిరిసిల్ల అర్బన్: రైతులు ఎరువుల కోసం ఫెర్టిలైజర్ దుకాణాల వద్ద పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా తీసుకొచ్చిన యాప్.. రైతులకు కొత్త కష్టాలను తెచ్చాయి. ఇప్పటికీ మన ప్రాంతంలోని రైతుల్లో అత్యధికులు చదువురాని వారే. అక్షరజ్ఞానం లేని అన్నదాతలు స్మార్ట్ఫోన్లో యూరియాను బుక్ చేసుకోవడం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం రైతుల కష్టాలను దూరం చేసేందుకే యాప్ను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ఎండనక.. వాననక ఫెర్టిలైజర్షాపుల వద్ద బారులు తీరే కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వం యాప్ను తీసుకొచ్చినట్లు తెలుపుతున్నారు. జిల్లాలో ఈనెల 1 నుంచి యాప్లో యూరియా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాకు 92,735 బస్తాల యూరియా వచ్చిందని, యాప్ ద్వారా 84,068 మంది బుకింగ్ చేసుకున్నారు. అయితే 79,948 మంది కొనుగోలు చేయగా.. 11,694 నిలువ ఉంది. ఇంకా 740 మంది రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని యూరియా తీసుకెళ్లలేదు.
డౌన్లోడ్, రిజిస్ట్రేషన్ ఇలా..
ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబరు నమోదు చేయాలి. ఫోన్కు వచ్చే ఓటీపీతో లాగిన్ కావాలి. జిల్లా, మండలం, గ్రామం, పట్టాదారు పాసు పుస్తకం నంబరుతో వివరాలు నమోదు చేయాలి. అవసరమైన యూరియా బస్తాల సంఖ్య ఎంచుకుని దగ్గరలోని డీలర్ వద్ద ఆర్డర్ చేసుకోవాలి. ఐడీ నంబర్ వస్తుంది. ఆర్డర్ చేసిన 24 గంటల్లో సదరు డీలరు వద్దకు వెళ్లి యూరియా, ఇతర ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చు.
కొంతమేరకు వేదిస్తున్న సమస్యలు
రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం యూరియా, ఇతర ఎరువుల కొనుగోలు కోసం యాప్ తీసుకురావడంతో పారదర్శకత పెరుగుతున్నా క్షేత్రస్థాయిలో గ్రామీణ రైతులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు సాధారణ కీప్యాడ్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్, యాప్ వినియోగంపై అవగాహన అంతంతే. చాలా గ్రామాల్లో ఇప్పటికీ సిగ్నల్ సమస్యతో సతమతమవుతున్నారు. ఇది రైతులకు ఇబ్బందిగా మారుతుంది.
రైతులు తమకు కావల్సిన యూరియాను యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. ఇంటి నుంచి బుకింగ్ చేసుకొని 24 గంటల్లో ఎంచుకున్న దుకాణం నుంచి కొనుగోలు చేయాలి. ఈ యాప్ను అలవాటు చేసేందుకు ప్రతి ఔట్లెట్ వద్ద వ్యవసాయశాఖ ద్వారా ఓ ప్రతినిధిని నియమించాం. యాప్ను సద్వినియోగం చేసుకోవాలి.
– సందీప్కుమార్, వ్యవసాయ అధికారి


