
నేతన్నలకు గతంలో కంటే మెరుగైన ఉపాధి
సిరిసిల్ల: జిల్లాలోని నేతన్నలకు, వస్త్రపరిశ్రమకు గతంలో కంటే మెరుగైన వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి ఆర్డర్ ద్వారా కార్మికులకు ఏడాదిలో 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందన్నారు. మిగతా 4 నెలలు కూడా ఉపాధి కల్పించేలా ప్రభుత్వం తరఫున ఇతర శాఖల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
లక్ష్యం సాధించకుంటే ఆర్డర్లు రద్దు..
శైలజ రామయ్యార్ మాట్లాడుతూ, సిరిసిల్లలోని 131 మ్యాక్స్ సొసైటీలు ఆర్డర్లు పొంది చీరలు ఉత్పత్తి చేయడంలో వెనకబడ్డాయని, ఈ నెలాఖరులోగా 50 శాతం ఉత్పత్తిని పూర్తి చేయాలన్నారు. లక్ష్యం సాధించని సొసైటీలకు ఆర్డర్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సొసైటీల వారీగా చీరల ఉత్పత్తి పురోగతిని సమీక్షించారు. అంతకు ముందు పవర్లూమ్ కార్ఖానాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తిని పరిశీలించారు. అలాగే టెక్స్టైల్ పార్క్ యజమానులతో సమీక్షించారు. టెక్స్టైల్ పార్క్కు మరిన్ని వస్త్రోత్పత్తి ఆర్డర్లు ముందస్తుగా ఇవ్వాలని పార్క్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్కుమార్ కోరారు. జౌళిశాఖ జేడీ వెంకటేశ్వర్రావు, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, మాజీ అధ్యక్షుడు గోవిందు రవి, మంచె శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, బొప్ప దేవయ్య, వైద్య శివప్రసాద్, ఆడెపు చంద్రకళ, గుండ్లపల్లి గౌతమ్, కార్మిక నాయకులు మూషం రమేశ్, వస్త్రోత్పత్తిదారులు పాల్గొన్నారు.
విప్ ఆది శ్రీనివాస్