● అధికారులకు 15 సార్లు అర్జీలు ఇచ్చినా న్యాయం జరగలేదు
● కన్నీటి పర్యంతమైన సుబ్బలక్ష్మి
తనకు చెందిన భూమిని మరో మహిళ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై 15 సార్లు అధికారులకు అర్జీలిచ్చినా న్యాయం చేయలేదని యర్రగొండపాలేనికి చెందిన వెలగపూడి సుబ్బలక్ష్మి సోమవారం కలెక్టరేట్లో జేసీ శ్రీనివాసులు, ఆర్డీఓ ప్రభాకర్ ఎదుట కన్నీటి పర్యంతమైంది. ‘యర్రగొండపాలెం పట్టణంలో సర్వే నం.58/1లో నాకు 570 చదరపు గజాల ఇంటి స్థలం ఉంది. అందులో 390 చదరపు గజాల స్థలంలో రేకుల షెడ్ వేసుకున్నా. ఈ స్థిరాస్తి మా అత్త వెలగపూడి వసుంధరాదేవి ద్వారా సంక్రమించింది. సెటిల్మెంట్ అగ్రిమెంట్ ద్వారా నాకు లభించిన స్థలాన్ని యర్రగొండపాలెం మండలం సర్వాయపాలేనికి చెందిన బి.యోగమ్మ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. న్యాయం చేయాలని కోరుతూ.. యర్రగొండపాలెం ఎమ్మార్వో, జిల్లా రిజిస్ట్రార్కు ఇప్పటి వరకు 15 సార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. పూర్తి రికార్డులు పరిశీలించి అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని వేడుకుంటున్నా’ అని జేసీకి విన్నవించింది. దీనిపై స్పందించిన జేసీ పూర్తి రికార్డులు పరిశీలించి సమస్య పరిష్కరించాలని మార్కాపురం రిజిస్ట్రార్ను ఆదేశించారు.


