భక్తులతో పులకించిన
మర్రిపూడి: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన పృథులగిరి లక్ష్మీనృసింహస్వామి తిరుణాళ్ల సోమవారం వైభవంగా సాగింది. పృథులగిరి భక్తులతో పోటెత్తింది. గత నెల 25 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం అశేషభక్త సమూహంతో పృథులాద్రి కిటకిటలాడింది. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం మారుతీచార్యులు, ఆదిశేషాచార్యులు, శ్రీనివాసాచార్యులు, వెంకటసాయిలు స్వామిని ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించారు. గరుడసేవ సందర్భంగా స్వామిని పల్లకిపై ఉంచి, బోయిలు సహయంతో స్వామిని మెట్లమార్గాన తీసుకెళ్లి అన్ని సత్రాల సమీపంలోని భక్తులకు దర్శనార్థానికి వీలుగా ఊరేగించారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, గ్రామాల నుంచి భక్తులు స్వామిని దర్శించుకొని ఆలయ ఆవరణలో పొంగళ్లు పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు బారులుదీరారు. వివిధ సామాజిక సత్రాల్లో భక్తులకు అన్నదానంచేశారు. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో తాగునీరు, మజ్జిగ, పులిహోర, పెరుగన్నం పంపిణీ చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారు స్వామి సన్నిధిలో ఊయల కట్టడం ఆనవాయితీ. మెట్ల మార్గాన నడిచి వచ్చే భక్తులకు సీతమ్మవారి పాదాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తులు మెట్లను పసుపు, కుంకుమలతో పూజించి మొక్కులు తీర్చుకున్నారు. మర్రిపూడి వైద్యాధికారి వీరబాబు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కందుకూరు డీఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, కొండపి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో మర్రిపూడి, కొండపి, పొన్నలూరు ఎస్సైలు బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైభవంగా గరుడోత్సవం
తిరునాళ్లను పురస్కరించనుకొని ఆలయ ఆవరణలో గరుడోత్సవం వైభవంగా సాగింది. అలవల వెంకయ్య, సుందరరావు, వలేటి నర్శింహారావులు ఉభయదాతలుగా వ్యవహరించారు. తిరునాళ్ల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కమనీయం శివపార్వతుల కల్యాణం..
శివ,విష్ణు పుణ్యక్షేత్రాలు ఒకే చోట కొలువై ఉండటంతో ఈ పృథులాద్రి ప్రత్యేకతను సంతరించుకుంది. లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి తూర్పు వైపున వేంచేసిన శివాలయంలో తిరునాళ్లను పురస్కరించుకొని స్వామి ప్రతిమలను పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. గండ్రకోట సోదరులు శ్రీనివాసశర్మ, వాసు, సురేంద్ర, కుమార్ తదితరులు శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పోటీపడ్టారు.
ఘనంగా లక్ష్మీనృసింహస్వామి గరుడోత్సవం
లక్ష్మీనృసింహుని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం
కమనీయం శివపార్వతుల కళ్యాణం


