మార్కాపురం టౌన్:
క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్కు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. రోజులు, నెలల తరబడి మండల కేంద్రాల్లో అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన బాధితులంతా జిల్లా కలెక్టరేట్లో లిఖితపూర్వకంగా అర్జీలు అందజేశారు. తమ సమస్యలను జిల్లా అధికారులకు వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సోమవారం ప్రకాశం కలెక్టరేట్లో గ్రీవెన్స్కు 281 అర్జీలు, మార్కాపురం కలెక్టరేట్లో గ్రీవెన్స్కు 83 అర్జీలు అందాయని ఆయా కార్యాలయాల అధికారులు వెల్లడించారు. మార్కాపురంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ పులి శ్రీనివాసులు, జిల్లా గనుల శాఖ ఏడీ పోలిరెడ్డి, ఏపీ మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నెమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేష్బాబు, ఆర్డీఓ ప్రభాకర్, ఐసీడీఎస్ పీడీ పద్మావతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రీవెన్స్కు గైర్హాజరైతే వేటు తప్పదు
● మార్కాపురం జేసీ హెచ్చరిక
మార్కాపురం జిల్లాలోని ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలపై అర్జీలు అధికంగా వస్తున్నాయని తహసీల్దార్లు, సిబ్బంది దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి జేసీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవిన్యూ సమస్యలపై పదే పదే అర్జీలు వస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గైర్హాజరైన కొందరు అధికారులకు ఫోన్ చేసి ఆహ్రహం వ్యక్తం చేశారు. మరోసారి నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఇకపై జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వారంలో మంగళ, గురు, శనివారాల్లో పట్టణాలు, గ్రామాల్లోని వైద్యశాలలు, ప్రభుత్వ పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలు, అన్నా క్యాంటీన్, ఆర్టీసీ బస్టాండ్లను తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పధకాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.
గ్రీవెన్స్కు వచ్చిన అర్జీల్లో కొన్ని..
రెవెన్యూ గ్రీవెన్స్కు ప్రకాశంలో 281, మార్కాపురంలో 83 అర్జీలు
సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని జేసీల ఆదేశం


