ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలి
అద్దంకి:
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరంతరం ప్రజల మధ్యనే వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉండాలని ఆ పార్టీ ప్రకాశం జిల్లా టాస్క్ఫోర్స్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. అద్దంకిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ సంస్థాగత నిర్మాణ కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్డర్ చింతలపూడి అశోక్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, అద్దంకి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు వైవీ భద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో లోపాలను బయటపెట్టి ఓటర్లను చైతన్యవంతం చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలు అడుగులు వేయాలని కోరారు. ప్రతి గ్రామంలో కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసే వారిని గెలిపించే విధంగా చూడాలని చెప్పారు. వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే బలమైన నాయకత్వం అవసరమన్నారు. పార్టీకి విధేయులుగా పనిచేసే వారిని గుర్తించి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను చైతన్యవంతం చేయాలని చెప్పారు. డాక్టర్ అశోక్కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని చెప్పారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి రాబోయే రోజుల్లో అద్దంకి గడ్డపై వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా
టాస్క్ఫోర్స్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలి


