పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి
ఒంగోలు సిటీ:
పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెరిగే విధంగా మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పి.రాజాబాబు కోరారు. ఒంగోలు సమీపంలోని రైజ్ కాలేజీలో జిల్లాలోని పోలీసు అధికారులకు సోమవారం వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ వి.హర్షవర్థన్రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ రాజాబాబు, 7వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి టి.రాజా వెంకటాద్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 2025వ సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు జిల్లావ్యాప్తంగా నమోదైన అన్ని రకాల కేసులపై జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ నేరాల నియంత్రణపై దృష్టి పెట్టడంతో పాటు కేసుల దర్యాప్తు సత్వరం పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సంబంధిత చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సమష్టిగా పనిచేయాలన్నారు. పైకి సివిల్ వివాదాలుగా కనిపిస్తున్నప్పటికీ నేరాలకు ఆస్కారం ఉన్న కేసులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు మరింత దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రణాళికలు రూపొందించుకోవాలి...
సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్రాజు మాట్లాడుతూ నేరాల తీరును విశ్లేషించాలని, వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరింత సమర్థవంతంగా పనిచేస్తూ ముందడుగు వేయాలని కోరారు. సాంకేతికత ఆధారిత పోలీసింగ్తో జిల్లాలో నేరాలు కొంత వరకు తగ్గాయన్నారు. మహిళా సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అదేవిధంగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఇతర శాఖల జిల్లా ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 2024 సంవత్సరంతో పోలిస్తే 2025లో తక్కువ కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. డయల్ 112 ద్వారా వెంటనే స్పందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు పోలీసింగ్ను మరింత చేరువ చేసేందుకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలి...
ఒంగోలు 7వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి టి రాజావెంకటాద్రి మాట్లాడుతూ కొత్త చట్టాల గురించి, సైబర్ నేరాలు, ప్రాపర్టీ నేరాల గురించి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పనిచేయాలని కోరారు. పలు అంశాలపై పోలీసులకు అవగాహన కల్పించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించి ప్రశంసపత్రాలు, రివార్డులు అందజేశారు. నేర సమీక్ష సమావేశంలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, డీటీసీ డీఎస్పీ జి.గురునాథబాబు, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై.ప్రశాంతి కుమారి, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.అజయ్బాబు, కనిగిరి ఏజేసీజే కోర్టు ఏపీపీ ఎస్.రఘునాథరావు, ఒంగోలు ఎకై ్సజ్ కోర్టు ఏపీపీ కె.శ్రావణ్ కుమార్, స్పెషల్ పీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, జిల్లాలోని అడిషనల్ పీపీలు, సిబ్బంది పాల్గొన్నారు.
పాల్గొన్న పోలీసు అధికారులు
మాట్లాడుతున్న కలెక్టర్ రాజాబాబు, పక్కన ఎస్పీ హర్షవర్థన్రాజు
ఆ విధంగా మెరుగైన సేవలు అందించాలి
కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు, జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి రాజావెంకటాద్రి పిలుపు
జిల్లా పోలీసు అధికారులతో వార్షిక నేర సమీక్ష సమావేశం
పోలీసులపై ప్రజల్లో విశ్వాసం పెంచాలి


