పేదలకు మెరుగైన వైద్యం కోసమే పోరాటం | - | Sakshi
Sakshi News home page

పేదలకు మెరుగైన వైద్యం కోసమే పోరాటం

Nov 11 2025 5:23 AM | Updated on Nov 11 2025 5:23 AM

పేదలకు మెరుగైన వైద్యం కోసమే పోరాటం

పేదలకు మెరుగైన వైద్యం కోసమే పోరాటం

చంద్రబాబు చరిత్రలో ఒక్క మెడికల్‌ కళాశాలా తీసుకురాలేదు జగన్‌కు పేరు వస్తుందని కుట్రచేసి ప్రైవేటుపరం చేస్తున్నారు ప్రైవేటుకు వ్యతిరేకంగా 12న దర్శిలో ప్రజాఉద్యమ నిరసన తుపాను బాధితులకు నిస్పక్షపాతంగా సాయం అందించాలి దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ డిమాండ్‌

దర్శి: మాజీ సీఎం, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే వైఎస్సార్‌ సీపీ తరఫున పోరాటం చేస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు. స్థానిక వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఈనెల 12న దర్శిలో జరిగే ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 15 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయన రాజకీయ చరిత్రలో ఒక్క మెడికల్‌ కళాశాల తీసుకురాకపోగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దారుణంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలు రాగా వాటిలో 5 మెడికల్‌ కళాశాలలు పూర్తి చేసి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారని గుర్తు చేశారు. మరో 12 మెడికల్‌ కళాశాలల పనులు జరుగుతూ వివిధ దశల్లో ఉన్నాయన్నారు. తాము అధికారంలో ఉండి ఉంటే ఈపాటికి వాటన్నింటినీ ప్రారంభించి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా 2550 మెడికల్‌ సీట్లు ఇచ్చి ఉండేవారమని స్పష్టం చేశారు. ఇప్పుడు వాటిని ప్రారంభిస్తే జగన్‌కు మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను తన బినామీలకు ధారాదత్తం చేసేందుకు పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు పేదలకు ఉచిత వైద్యం అందించే కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఊరూరా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. పీపీపీ విధానం ద్వారా ఆస్పత్రులు ప్రైవేటు వారి చేతుల్లోకి వెళితే పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ప్రారంభమైతే 2550 సీట్లు వస్తాయని, పేద విద్యార్థులు ఇక్కడే ఉండి ఉచితంగా చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని పీపీపీ విధానం రద్దు చేసి పేదలకు మేలు చేయాలని డిమాండ్‌ చేశారు. పీపీపీ విధానం ఎత్తివేసే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ నెల 12న జరిగే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా దర్శిలో జరిగే ప్రజా ఉద్యమం కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

మోంథా తుపాను బాధితులకు వెంటనే పరిహారం అందించాలి:

ఇటీవల కురిసిన మోథా తుపాను వలన వరి, పత్తి, మిరప, మొక్కజొన్న, సజ్జ పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్ట పరిహారాలను కుదించి రైతులకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్ట పరిహారం అందించి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దర్శి, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, చింతాశ్రీనివాసరెడ్డి, తూము వెంకటసుబ్బారెడ్డి, దొనకొండ ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి, యూత్‌ జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్‌, జెడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్‌ రెడ్డి, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి షేక్‌ సైదా, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా ఉదయ్‌ భాస్కర్‌, వైస్‌ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు మేడం మోహన్‌రెడ్డి, జగన్నాథం మోహన్‌బాబు, ఆవులజ్యోతి శివారెడ్డి, ఎంపీటీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు గల్లెపోగు ఏసుదాసు, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, నాయకులు సూది దేవర అంజయ్య, వేమిరెడ్డి చెన్నారెడ్డి, కొడవటి జాన్‌, పాలెపోగు డగ్లస్‌, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement