
ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం.. సమాచార హక్కు చట్టం
● ర్యాలీలో డీఆర్ఓ ఓబులేసు
ఒంగోలు సబర్బన్: సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు అన్నారు. సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలులో ర్యాలీ, సమావేశం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ మీదుగా చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు మాట్లాడుతూ సమాచర హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ, సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టం ద్వారా ప్రజలడిగిన సమాచారాన్ని అధికారులు అందించాలన్నారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం విజయవాడలోని ప్రధాన సమాచార కార్యాలయం వర్చువల్గా కూడా విచారణ నిర్వహిస్తోందని, ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ జ్యోతి, జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్, ఒంగోలు అర్బన్ తహసీల్దార్ పిన్నిక మధుసూదనరావు, ఒంగోలు రూరల్ డిప్యూటీ తహసీల్దార్ కుట్టుబోయిన అశోక్ కుమార్, రూరల్ ఆర్ఐ శ్రీకంఠ శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.