
డైట్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
ఒంగోలు సిటీ: అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా మైనంపాడు డైట్ కళాశాలలో గురువారం ఫుడ్ ఫెస్టివల్ గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు వివిధ రకాల వంటలను ప్రదర్శించారు. ప్రత ఒక్కరూ వంటకం తయారీ విధానం, దానిలో ఉన్న పోషక విలువ గురించి వివరించారు. వారు చేసిన ప్రత్యేక వంటకాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ వంటకాలు రుచి చూసి విద్యార్థులను అభినందించారు.
ఒంగోలు సిటీ: గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం కరవది–ఒంగోలు రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. ఒంగోలు రైల్వేస్టేషన్ ఆన్డ్యూటీ స్టేషన్ మాస్టరు ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్సై మధుసూధనరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు..కరవది–ఒంగోలు రైల్వేస్టేషన్ల మధ్య 50 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతున్న క్రమంలో, లేదా తనంతట తాను రైలు ఢీకొని మృతి చెందాడా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. మృతున్ని గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుని వివరాలు తెలిస్తే 9440627647 నంబర్ను సంప్రదించాలని కోరారు.
టంగుటూరు: కడుపునొప్పి భరించలేక ఎలుకల మందు తిని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని కారుమంచిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చీరాలకు చెందిన వహీద(25)కు కారుమంచికి చెందిన అరవింద్లో ఆరేళ్ల క్రితం వివాహమైంది. అయితే ఆమె కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చూయిస్తున్నా తగ్గలేదు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా కారుమంచి వచ్చి వెళ్లారు. పెద్ద ఆస్పత్రిలో చూయిస్తామని చెప్పారు. ఈ క్రమంలో గత నెల 25న విపరీతమైన కడుపు నొప్పి రావడంతో భరించలేక ఇంట్లోనే ఎలుకలమందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన భర్త అరవింద్ ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఈ మేరకు వహీదా తల్లి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టంగుటూరు తహసీల్దార్ ఆంజనేయులు ఒంగోలు జీజీహెచ్లో శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
రాచర్ల: అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు సరుడును దొంగలించేందుకు గుర్తు తెలియని దుండగుడు విఫలయత్నం చేశాడు. ఈ సంఘటన మండలంలోని జేపీ చెరువు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కొక్కు అంకమ్మ తన నివాసంలో బుధవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు వచ్చి బంగారు సరుడును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అంకమ్మ అప్రమత్తమై పెద్దపెట్టున కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడు. చోరీకి వచ్చిన వ్యక్తి టోపీ సంఘటన స్థలంలో పడిపోయిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఒంగోలు సిటీ: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో చెకుముకి సైన్న్స్ సంబరాలు ప్రారంభించనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు వెంకట్రావు, జి.శ్రీనివాసులరెడ్డి తెలిపారు. పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 18న 8, 9, 10 తరగతులకు విద్యార్థులకు సైన్సు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పాఠశాల స్థాయిలో మొదటిస్థానం పొందిన విద్యార్థులను ఎంపిక చేసి ముగ్గురు విద్యార్థులను ఆ పాఠశాల జట్టుగా నవంబర్ 1న జరగనున్న మండల, పట్టణ స్థాయి చెకుముకి సైన్సు సంబరాలకు పంపాలన్నారు. పూర్తి వివరాలకు 8309335057, 9948220868 ను సంప్రదించాలని కోరారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు సైన్సుపై ఆసక్తి పెంపొందించేందుకు చెకుముకి సంబరాలు ఉపయోగపడతాయన్నారు. పాఠశాల స్థాయి చెకుముకిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, విద్యాధికారులు విద్యార్థులను ప్రోత్సహించి జయప్రదం చేయాలని కోరారు.

డైట్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

డైట్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్