
లారీ ఢీకొని దంపతులు దుర్మరణం
మేదరమెట్ల: కుమార్తెను చూసి తిరిగివెళ్తున్న దంపతులను జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఆ వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సుబ్బారెడ్డికాలనీ రొంపిచర్ల గ్రామానికి చెందిన బత్తుల కొండలు (49), లక్ష్మి (41) దంపతులు ప్రకాశం జిల్లా నాగులుప్పలప్పాడు మండల కేంద్రంలో ఉంటున్న కుమార్తె వద్దకు వచ్చారు. గురువారం ఉదయం తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు మోటారు బైకుపై బయలుదేరారు. తిమ్మనపాలెం గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా రాంగ్రూట్లో లారీ వచ్చి మోటారు బైకును ఢీకొట్టింది. బైకుపై ఉన్న దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. వారి మీదుగా లారీ వెళ్లడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మోటారు బైకు లారీ ముందుభాగంలో కిందివైపు ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. అద్దంకి రూరల్ సీఐ శివరామకృష్ణారెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. లారీ ఇడుపుగల్లు నుంచి కందుకూరుకు టైల్స్ లోడుతో వెళ్తున్నట్లు తెలిసింది.
రాంగ్ రూట్లో వచ్చి బైకును ఢీకొట్టిన లారీ
కుమార్తెను చూసి తిరిగివెళ్తూ అనంతలోకాలకు దంపతులు

లారీ ఢీకొని దంపతులు దుర్మరణం