
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయిల్, సూర్యనారాయణ ఫైర్
మండలిలో పలు సమస్యలు ప్రస్తావించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి కాకినాడలో బియ్యం తరలిస్తున్న షిప్ను సీజ్ చేయాలని, సీజ్ ద షిప్ అంటూ గతంలో ఆదేశించారని, ఆ కేసు ఏమైందో ప్రభుత్వం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. శాసన మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పెరిగిన బియ్యం అక్రమ రవాణాకు నమోదైన కేసులే అద్దంపడుతున్నాయన్నారు. కాకినాడ, విశాఖ పోర్టుల కేంద్రంగా పెద్దఎత్తున బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతోందన్నారు. మరో ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ.. పౌర సరఫరాలు, పోలీసు శాఖలోని కొందరు రేషన్ మాఫియాతో చేతులు కలిపారని, కాకినాడ పోర్టులో బియ్యం డంప్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. తిరిగి ఈ మాఫియా ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు.
అనంతరం.. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం పంపిణీ విధానాన్ని రద్దుచేశామన్నారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 2,438 కేసులు నమోదుచేసి 5 లక్షల క్వింటాళ్లకు పైగా బియ్యం స్వా«దీనం చేసుకున్నామని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక శాఖకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం సరికాదన్నారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఉద్యోగాల కల్పన, పరిశ్రమలపై ప్రభుత్వ దాటవేత ధోరణి సరికాదన్నారు. తూమాటి మాధవరావు మాట్లాడుతూ లులుకు ఖరీదైన భూమి ఎలా కేటాయించారని ప్రశ్నించారు. కల్పలతారెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన మెడికోలను శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు.