
సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబును నిలదీస్తున్న వైఎస్ జగన్
సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ అని ప్రజలకు అర్థమైంది
అట్టర్ ఫ్లాప్ అయిన సూపర్ సిక్స్కు విజయోత్సవ సభ
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం
బుద్ధి, జ్ఞానం ఉంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారా?.. స్కూళ్లు, బస్సులు, ఆస్పత్రులను ప్రభుత్వాలు ఎందుకు నడుపుతాయో తెలీదా?
వాటిని ప్రభుత్వం నడపకపోతే పేదల పరిస్థితి ఏమిటి? దోపిడీకి గురికారా?.. డబ్బులు లేకపోయినా అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు
కానీ.. మెడికల్ కాలేజీలకు మాత్రం రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరట.. ఏ ఒక్కరికీ మేలు చేయకపోయినా 16 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పులు
ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ..
ఇసుక ఫ్రీ అన్నారు.. గతంలో కంటే డబుల్ రేట్
వైఎస్సార్సీపీ హయాంలో ఇసుకతో ఏటా రూ.750 కోట్ల ఆదాయం
ఈ పెద్దమనిషి ఎన్నికలప్పుడు ఏం చెప్పి వచ్చాడు.. వచ్చాక ఏం చేస్తున్నాడు? అప్పట్లో సంపద సృష్టిస్తానని పదే పదే ప్రతి మీటింగ్లో చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాత్రమే కాదు.. జగన్ చేసినవన్నీ కూడా చేస్తూ.. ఇంకా ఎక్కువే ఇస్తానన్నాడు. ఈ రోజు పరిస్థితి చూస్తే.. సంపద సృష్టించడం అంటే.. కేవలం తనకు, తన మనుషులకే సంపద సృష్టించడం అని తేటతెల్లం అయింది. రాష్ట్రానికి సంపద సృష్టించడం దేవుడెరుగు.. స్కామ్లు చేస్తూ ఉన్న సంపద ఆవిరి చేస్తున్న పరిస్థితి. మన ప్రభుత్వంలో అమలు చేసిన స్కీములన్నింటినీ రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు గాలికెగిరిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం అనేది మంచి విద్యా వ్యవస్థను, ప్రతి పేదవాడికి అందుబాటులో మంచి వైద్య వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని అనుకుంటాం. రైతుకు అండదండగా ఉంటుందనుకుంటాం. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఎలాంటి వివక్ష లేకుండా ఉండాలని, అలాంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు. ఓట్లు వేసినప్పుడు ఎవరైనా ఇవన్నీ కోరుకుంటారు. కానీ ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్.. ఇలా ఏది తీసుకున్నా, కనపించేది తిరోగమనమే.
– వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. చంద్రబాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ అని ప్రజలకు అర్థమైందన్నారు. సంపద సృష్టించి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేస్తానని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక స్కామ్లు చేస్తూ, ఉన్న సంపదను ఆవిరిచేస్తూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం రద్దు చేశారని మండిపడ్డారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకపోయినా, అమలు చేసినట్లు గోబెల్స్ ప్రచారం చేస్తూ విజయోత్సవాలు జరిపిస్తున్నారని దెప్పిపొడిచారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్య బట్టారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం తన అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రీజినల్ కో–ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శుల (పార్లమెంటు)ను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశా నిర్దేశం చేశారు. సజావుగా ఎన్నికలు జరిగితే డిపాజిట్లు కూడా దక్కవని చంద్రబాబుకు తెలుసని.. అందుకే సజావుగా ఎన్నికలు జరపడని.. కాబట్టి మీరందరూ ఇంకా గట్టిగా నిలబడి, పోరాడాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో వ్యతిరేకత
⇒ ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు.
⇒ ఇప్పుడు రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ‘ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్’ అంటున్నారు. ఇది నిజంగా వాస్తవం.
పథకాలు మాయమైపోయాయి
⇒ ఈమధ్య ఈ పెద్ద మనిషి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో విజయోత్సవ సభ పెట్టబోతున్నప్పుడు వాళ్ల పాంప్లెట్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కు, ఈ అడ్వర్టైజ్మెంట్కు మధ్య స్పష్టమైన తేడా ఉంది. కొన్ని పథకాలను ఎగ్గొట్టేశారు. ఇప్పుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంశాలు మారిపోయాయి.
⇒ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ మొన్నటి అడ్వర్టైజ్మెంట్లో కనిపించలేదు.
⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామంటూ అడ్వర్టైజ్మెంట్స్లోని అంశాలను మార్చేసి అన్నీ చేసేశాం అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ స్థాయిలో మోసం చేసే వారు ప్రపంచ చరిత్రలో మరొకరు ఉండరు.
ఇంటింటికీ బాండ్లు, సంతకాలతో ప్రతిజ్ఞలు
⇒ ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ బాండ్లు పంపించారు. బాండ్లకు సంబంధించి ప్రతి ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. అందులో మీకు ఆడబిడ్డ నిధి కింద ఇంత, తల్లికి వందనం కింద ఇంత, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, యువగళం (నిరుద్యోగ భృతి) కింద నెలకు రూ.3 వేలు, ఏడాదికి రూ.36 వేల చొప్పున.. ఆ కుటుంబానికి ఏటా ఇంత మొత్తం ఇస్తామంటూ బాండ్లు ఇచ్చారు.
⇒ ఇంకా ‘చంద్రబాబు నాయుడు అనే నేను అధికారంలోకి వచ్చాక, భవిష్యత్ గ్యారెంటీలోని హామీలను త్రికరణ శుద్ధితో నెరవేరుస్తానని, ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది’.. అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు, వారి సంతకాలతో కూడిన ప్రతిజ్ఞా పత్రాలు ఇంటింటికీ పంపించారు.
వాస్తవంగా ఏం చేశారంటే..
⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో కొన్నింటిని కొద్దో గొప్పో అమలు చేసినా, వాటిని కూడా అందరికీ ఇవ్వకుండా కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పి.. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపే రూ.20 వేలు ఇస్తామన్నారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. ఆ తర్వాత రెండేళ్లకు కలిపి రూ.40 వేలకు గాను రూ.5 వేలే ఇచ్చారు.
⇒ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. రెండేళ్లకు కలిపి ఆరు సిలిండర్లకు ఇచ్చింది ఒక్కటే. అది కూడా కొందరికే. రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. కానీ అది కొన్ని బస్సులకే పరిమితం చేశారు. మనం ఇచ్చిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. చివరికి 30 లక్షల మంది పిల్లలకు కట్ చేశారు. రూ.15 వేలు ఇస్తానన్నది కాస్తా రూ.13 వేలు చేశారు. అదీ పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి రూ.10 వేలు, ఇంకొందరికి రూ.9 వేలు, మరి కొందరికి రూ.8 వేలు మాత్రమే ఇచ్చారు. ఇలా చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోనూ మోసం, అబద్ధమే కనిపిస్తోంది.
రైతులకు అంతులేని కష్టాలు
⇒ వ్యవసాయానికి సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. యూరియా దొరకని దుస్థితి. మార్కెట్లో బ్లాక్ చేసేశారు. రేట్లు పెంచేశారు. దళారీలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపినందువల్లే ఈ దుస్థితి. ప్రైవేటుకి కోటా పెంచేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు వచ్చే సరుకును వీళ్ల కార్యకర్తలు ఎత్తడం మొదలుపెట్టారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ అనేది కనపడకుండా పోయింది. రైతన్నకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయిన పరిస్ధితి. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా పోయిన సంవత్సరం ఈ ప్రభుత్వం కట్టలేదు. మన ప్రభుత్వ ఐదేళ్లలో ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి రైతు చూశాడా?
⇒ మన ప్రభుత్వంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు రావడమే కాకుండా, రైతులకు ఆర్బీకేల ద్వారా, ఈ క్రాప్ ద్వారా మద్దతు ధర కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడా లేదు. ఇంకా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్టేషన్) కింద అదనంగా ఎకరాకు దాదాపు రూ.10 వేలు ఇచ్చిన పరిస్థితులు మన ప్రభుత్వంలో కనిపించాయి.
ఈ ధాన్యం ప్రజలు తినరట..
⇒ రైతులు పండించిన ధాన్యం తినే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు చెప్తాడు. అందుకే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదంటున్నాడు. ఈ ధాన్యమంతా ఇథనాల్ (లిక్కర్లో వినియోగించే) తయారు చేసే దానికి వాడతారంటున్నాడు. అంటే రాబోయే రోజుల్లో కూడా ధాన్యం సేకరణలో నా విధానం ఇదేనని చెబుతున్నట్టేగా? ధాన్యానికి ఇంకెప్పుడూ గిట్టుబాటు ధర రాదు.. పండించడం మానేయండి.. అని చెబుతున్నాడు.
⇒ కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, అరటి, టమాటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంటకూ ఈ రోజు గిట్టుబాటు ధర లేదు. కారణం.. దగ్గరుండి ఆర్బీకే వ్యవస్థను, ఈ క్రాప్ను నిర్వీర్యం చేయడమే.
⇒ నాడు మన ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూ రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా నిలిచాం.
అధ్వానంగా విద్యా రంగం
⇒ విద్యా రంగంలో నాడు–నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నీరుగారిపోయింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది. ఇంగ్లిష్ మీడియం చదువులు పిల్లలకు ఎండమావి అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే.. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ త్రైమాసికం అయిపోతే ఆ త్రైమాసికానికి వెంటనే మన ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను మన ప్రభుత్వం గొప్పగా అమలు చేసింది.
⇒ 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంతే.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఫినిష్. అప్పటి నుంచి ఈ సెప్టెంబరు వరకు 7 క్వార్టర్స్కు సంబంధించి, ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్లు.. ఇలా మొత్తం రూ.4900 కోట్ల బకాయిలు ఉన్నాయి. కానీ, ఈ పెద్దమనిషి రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.
⇒ గత ఏడాది ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వల్ల జగనన్న వసతి దీవెన ఆగిపోయింది. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది కూడా ఇవ్వడం లేదు. అలా వసతి దీవెన కింద ఈ ప్రభుత్వం రూ.2,200 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది సున్నా. ఈ రోజు పిల్లల చదువులు ఆగిపోతున్న పరిస్థితి.
వైద్య రంగం నిర్వీర్యం
⇒ ఆరోగ్యశ్రీలో మన ప్రభుత్వంలో రూ.25 లక్షల వరకు ప్రతి పేదవాడు దర్జాగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. ఆ రోజు 3 వేలకు పైగా ప్రోసిజర్లకు వైద్యం ఉచితంగా అందించాం. ఈ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీకి గత 16 నెలలుగా బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నడపాలంటే ప్రతి నెలా రూ.300 కోట్లు అవసరం. ఈ 16 నెలల్లో దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టారు. దాంతో నెట్వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేశాయి. పేదవాడు వైద్యం కోసం ఈరోజు ప్రైవేట్ ఆçస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి.
⇒ రోగికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో డాక్టర్లు సూచించినంత కాలం రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఇచ్చి మన ప్రభుత్వంలో గొప్ప సహాయంగా ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశాం. సంవత్సరానికి రూ.450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలల్లో అయ్యే ఖర్చు దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది. కానీ చంద్రబాబు ఈ పథకానికి ఇచ్చింది సున్నా.
అమరావతికి రూ.2 లక్షల కోట్లట!
⇒ చంద్రబాబు ప్రాజెక్టు రిపోర్టు ప్రకారమే అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు కావాలంటున్నాడు. మొదటి దఫా 50 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున మౌలిక వసతుల కల్పనకు ఖర్చవుతుందంటున్నారు. ఇది రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ కోసం మాత్రమే. గత చంద్రబాబు ప్రభుత్వంలో వీటి కోసమే రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాడు. ఇంకా రూ.95 వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఖర్చు చేస్తారు?
⇒ ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇంకా 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. ఈ 50 వేల ఎకరాలకు మరో లక్ష కోట్లు కావాలని ఎస్టిమేషన్ వేశాడు. మొత్తంగా రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? రూ.5 వేల కోట్లు ఖర్చు చేయడానికి డబ్బు లేదట! చంద్రబాబూ అసలు నీవు మనిషివేనా? ఇక లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు.
అంతులేని అవినీతి.. యథేచ్ఛగా దోపిడీ
⇒ కూటమి పాలనలో అవినీతి లేనిది ఎక్కడో చెప్పాలి. మద్యం, ఇసుక, లాటరైట్, బాక్సైట్, క్వార్ట్›జ్, సిలికా, మట్టి దేన్నీ వదలడం లేదు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు. కుట్టుమిషన్ల నుంచి మొదలు పెడితే.. ఎకరా భూమి 90 పైసలే. మన ప్రభుత్వంలో రూ.2.40 చొప్పున యూనిట్ విద్యుత్ కొనుగోలు చేస్తే, వీళ్లు అదే యూనిట్ రూ.4.60తో కొనేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏది చూసినా స్కామ్లే.
⇒ మన హయాంలో ప్రభుత్వ ఖజానాకు ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రోజు ఖజానాకు రూపాయి కూడా రావడం లేదు. ఇసుక రేటు మాత్రం మన హయాంలో కన్నా డబుల్ అయ్యింది. ఆ ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. జీఎస్టీ ఎందుకు తగ్గుతుందంటే.. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గబట్టే కదా?
⇒ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఇది మనం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 57 శాతం. కొత్తగా స్కీమ్లు లేవు, పాత స్కీమ్లన్నీ రద్దు చేశారు. మరి ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది.. ఎవరి జేబుల్లోకి పోతోంది?
మెడికల్ కాలేజీల అమ్మకం అత్యంత హేయం
⇒ ఈ రోజు చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టాడు. బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని ఆలోచన చేస్తాడా? అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎక్కడైనా మెడికల్ కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను ప్రభుత్వాలే ఎందుకు నడుపుతాయో అందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ వాటిని నడపకపోతే నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో పేదలు తమ పిల్లలను చదివించగలిగే పరిస్థితి ఉండదు. గవర్నమెంట్ ఆస్పత్రులు లేకపోతే పేదలకు ఉచితంగా వైద్యం అందడం సాధ్యమేనా?. గవర్నమెంట్ బస్సులు నడపకపోతే ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించగలరా? అందుకోసమే దేశ వ్యాప్తంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్కూళ్లు, ఆసుపత్రులు, బస్సులు నడుపుతున్నారు.
⇒ ఆ రోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ టీచింగ్ ఆస్పత్రిని తీసుకువచ్చాం. అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తీసుకువచ్చాం. ఈ టీచింగ్ ఆస్పత్రుల్లో పనిచేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ మెడికల్, ఎంబీబీఎస్ విద్యార్థులు, నర్సులు, వివిధ సేవలు చేసే వ్యక్తులు మెడికల్ కాలేజీలో అందుబాటులో ఉంటారు. అంతమంది అందుబాటులో ఉంటారు కాబట్టి పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంది. అలాంటి గొప్ప విప్లవాన్ని మన ప్రభుత్వంలో తీసుకువచ్చాం.
⇒ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. మన పిల్లలు చాలా మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకే సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉంటాయి. ఇది రెండో అడ్వాంటేజ్. ఇలాంటి కార్యక్రమాన్ని.. చంద్రబాబు స్కామ్ల కోసం దుర్వినియోగం చేస్తూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేక చేతులెత్తేశాడు.
⇒ రూ.8 వేల కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి మన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. మరో రెండు కాలేజీలు పులివెందుల, పాడేరు చంద్రబాబు ప్రభుత్వం రాకముందే ప్రారంభోత్సవానికి సిద్ధం చేశాం. వాటికి కూడా అనుమతులు వచ్చాయి. దాదాపుగా 17 కాలేజీలను మనం మొదలుపెట్టి వాటిలో 7 కాలేజీలను పూర్తి చేయగలిగాం. ఇంకో రూ.5 వేల కోట్లు అంటే, ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలన్నీ పూర్తి అవుతాయి కదా.. కానీ చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరు.