రాజమండ్రి: గుంటూరు బయల్దేరిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. అంబటి వాహనం వెనుక మూడుకు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేశారు పోలీసులు. అంబటి రాంబాబు వాహనం బయల్దేరిన వెంటనే కాన్వాయ్గా వస్తున్న పలు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో జక్కంపూడి రాజాతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు.
దాంతో ఆయన ప్రయాణిస్తున్న వాహనం దిగి వెనక్కి వచ్చారు అంబటి. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు అనుమతిస్తే గుంటూరుకు కారులో వెళతా.. లేకపోతే గుంటూరుకు పాదయాత్రగా వెళతా’ అంటూ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందంటూ మండిపడ్డారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళుతున్న వారిపై ఈ తరహా దాష్టీకం చేయడం సరికాదన్నారు..
‘రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొంది. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇంతకన్నా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టగలరు’ అంటూ ధ్వజమెత్తారు. తన ఇల్లును పగలగొట్టినప్పడు 30 యక్ట్ లేదా.. ఇప్పుడు 30 యాక్ట్ వచ్చిందా అంటూ అంబటి ప్రశ్నించారు. పోలీసులు దగ్గరుండి తన ఇల్లును పగలగొట్టించారని, ఆ రోజు ఏమైంది 30 యాక్ట్ అంటూ నిలదీశారు. తాను శాంతియుతంగా గుంటూరుకు వెళుతున్నానని, మీరు కారులో వెళ్లడానికి అనుమతి ఇవ్వకపోతే మాత్రం పాదయాత్రగా గుంటూరుకు వెళతా అంటూ హెచ్చరించారు.

రాజమండ్రిలో పోలీసుల హైడ్రామా
రాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. అంబటి కాన్వాయ్ను పదే పదే అడ్డుకుంటున్నారు. ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న వాహనాలను నిలిపి వేస్తున్నారు పోలీసులు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు.


