తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Comments at YSRCP Legal Cell meeting | Sakshi
Sakshi News home page

తప్పుడు సాక్ష్యాలు.. అక్రమ కేసులు: వైఎస్‌ జగన్‌

Aug 6 2025 4:59 AM | Updated on Aug 6 2025 7:37 AM

YS Jagan Mohan Reddy Comments at YSRCP Legal Cell meeting

పాలనంతా అబద్ధాలు, మోసాలు.. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

న్యాయం, ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన

వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ సమావేశంలో వైఎస్‌ జగన్‌ 

చంద్రబాబు పాలన కలియుగానికి నిదర్శనం 

తమకు గిట్టని వారు, నచ్చని వారిపై దౌర్జన్యం 

ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేని వైనం 

తప్పుడు కేసులతో చిత్రహింసలు పెట్టడం, జైల్లో వేయడం 

ఇలాంటి పరిస్థితిలో బాధితులకు అండగా నిలబడుతున్నది లాయర్లే 

పార్టీకి పెద్దన్నల్లా మీ సేవలు అభినందనీయం 

కష్టకాలంలో మీ సేవలు, అంకితభావం గుర్తు పెట్టుకుంటాం 

పక్కాగా డేటా బేస్‌తో జగన్‌ 2.0లో పూర్తి న్యాయం చేస్తాం

ఈరోజు మనం వాదిస్తోంది దెబ్బ తిన్న వాళ్ల గురించి. కళ్ల ఎదుటే దొంగ స్టేట్‌మెంట్లు, దొంగ సాక్ష్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఒక కేసులో బయటకు రాగానే, వెంటనే మరో కేసు పెట్టి లోపల వేస్తున్నారు. అలా వరసగా కేసులు పెట్టి.. జైల్లోనే ఉంచేస్తున్నారు. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అది వారికి అర్థం కావాలి. అధికారం ఉంది కదా అని, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి. ఇందులో మీ పాత్ర కీలకం. మీ సేవలను గుర్తుంచుకుంటాం. 
– న్యాయవాదులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్ద­న్నల్లా లాయర్లు పని చేస్తున్నారని ప్రశంసించారు. కలియుగం అంటే ఏమిటన్నది ఈ 14 నెలల చంద్ర­బాబు పాలన చూస్తే అర్థమవుతుందన్నారు. ఎక్కడా న్యాయం, ధర్మం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, చోటుచేసు­కున్న పరిస్థి­తులపై మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతి­నిధులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 

‘రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు­న్నాయి’. ఈ సమయంలో మీరు పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు పార్టీకి అన్ని విధాలుగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అడగకపోతే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్నట్లుగా.. కోరకపోతే దేవుడు కూడా వరమివ్వడు అన్నట్లుగా.. పిటిషన్లు వేసి, మీరు న్యాయస్థానంలో నిలబడకపోతే, న్యాయం కూడా దక్కదు. అందుకే మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం’ అని ప్రశంసించారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

స్వరం వినిపిస్తే జీర్ణించుకోలేని పరిస్థితి 
తమకు గిట్టని వారు, నచ్చని వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా తమ స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకుని, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలి. ఎలాగైనా వారిని తీసు­కెళ్లి చిత్ర హింసలు పెట్టాలి. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి ఈరోజు చూస్తున్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే తన పరువు, ప్రతిష్టతో ఆడుకోవడం. అవన్నీ తెలిసి కూడా, ఏ తప్పు చేయకపోయినా కూడా బురద చల్లుతు­న్నారు. తప్పు చేశాడు అని చెప్పి, దాని కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. 

కేసులు పెడుతున్నారు. వాటికి అసలు ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. ఏ కేసు చూసినా మోడస్‌ ఆపరెండి ఒక్కటే. తొలిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థి­తుల మధ్య బా«ధితుల తరఫున గట్టిగా నిలబడి, వారి స్వరం వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మీ పాత్ర చాలా ముఖ్యం. మన భుజాల మీద బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యంగా కష్టకాలంలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైఎస్సార్‌సీపీకి పెద్దన్నగా మీ పాత్రను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు.

నాడు లీగల్‌ కమ్యూనిటీకి ఎంతో మేలు
గతంలో మనం (వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం) లాయర్లు, లీగల్‌ కమ్యూనిటీకి ఏం చేశామనేది నా కంటే, మీరే బాగా చెబుతారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ ఊహించని విధంగా యువ న్యాయవాదులకు ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా ‘లా నేస్తం’ ఇచ్చాం. అలా యువ లాయ­ర్లకు అండగా, తోడుగా నిలిచాం. నిజంగా అట్ట­డుగు వర్గాలకు తోడుగా ఉండాలని, జీపీలు, ఏజీపీల నియామకాల్లో 52% రిజర్వేషన్‌ ఇచ్చాం. 

అది కేవలం వైఎస్సార్‌సీపీ హయాంలోనే జరిగింది. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించి, అందులో రూ.25 కోట్లు ఖర్చు చేశాం. లాయర్ల ఇన్సూరెన్స్‌ పథకానికి కూడా మూడో వంతు ప్రభుత్వమే చెల్లించింది. ఇవన్నీ అప్పట్లో గర్వపడే విధంగా చేశాం. అయితే కూటమి ప్రభుత్వంలో చివరకు లాయర్లను కూడా మోసం చేశారు. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఏవీ లేవు. 

అంతా మోసం. మన ప్రభుత్వంలోని పథకాలన్నీ రద్దు చేశారు. వారి హామీలు మోసా­లుగా మారాయి. మరో­వైపు అన్ని వ్యవస్థలు దిగజా­రి­పోయాయి. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగం, శాంతి భద్ర­తలు ఇంకా పరిపాలనలో పారదర్శకత.. ఏది తీసు­కున్నా అన్నీ అస్తవ్యస్తం. అన్నింట్లో తిరోగమనం. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు.

విచ్చలవిడిగా అవినీతి 
రాష్ట్రంలో అవినీతి మామూలుగా లేదు. విచ్చల­విడిగా సాగుతోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టుషాప్‌లు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. అందుకోసం వేలం పాటలు నిర్వహిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మిస్తున్నారు. ఇది కళ్ల ముందు కనిపి­స్తున్న పచ్చి నిజం. ఎక్కడ చూసినా చట్ట విరుద్ధంగా పర్మిట్‌ రూమ్‌లు. అక్కడ బాటిళ్లు కాకుండా, పెగ్‌ల ద్వారా మద్యం అమ్ముతున్నారు. 



అదీ చట్ట విరు­ద్ధమే. అది కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువే. ఇసుక ఫ్రీ అన్నారు. కానీ ఎవరికీ ఇవ్వడం లేదు. అంతా దోపిడి. గతంలో మన ప్రభుత్వంలో ఇసుక సరఫ­రాలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్లు రాయల్టీగా వచ్చేది. ఇప్పుడు అది రాకపోగా, ఇసుక ధర రెట్టింపు అయింది. ఏ నియోజకవర్గం తీసుకున్నా కళ్ల ముందే పేకాట క్లబ్‌లు. వాటన్నింటినీ ఎమ్మెల్యేలు నడిపిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి అన్నీ చూసు­కుంటున్నారు. ఇది కూడా కళ్ల ముందే కనిపిస్తున్న నిజం.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి(లీగల్‌) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పలువురు సీనియర్‌ న్యాయవాదులు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

అమరావతి నిర్మాణంలో యథేచ్ఛగా దోపిడీ
అమరావతి నిర్మాణం పేరుతో యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. చదరపు అడుగు రూ.4 వేలు లేదా రూ.4,500కు లగ్జరీగా ఎక్కడైనా బ్రహ్మాండంగా కట్టొచ్చు. ఆ రేటుకు హైదరాబాద్, బెంగళూరులోనూ కట్టొచ్చు. కానీ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణాన్ని రూ.9,500, రూ.10 వేలకు ఇచ్చారు. 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ఇచ్చి, 8 శాతం తీసుకుంటున్నారు. ఇది కూడా కళ్లముందే కనిపిస్తున్న నిజం. ఇంకా విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందం (పీపీఏ)లోనూ అవినీతి. 

మనం యూనిట్‌ రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, అప్పుడు మనపై బురద చల్లారు. ఆ తర్వాత వాళ్లు అదే యూనిట్‌ విద్యుత్‌కు రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు. ఎక్కడ చూసినా అవినీతే. ఏ పని చేయాలన్నా, కంపెనీ నడపాలన్నా, మైనింగ్‌ చేయాలన్నా, గ్రావెల్‌ తరలించాలన్నా ముందు ఎమ్మెల్యేను కలవాలి. లంచం ఇవ్వాలి. వారు కొంత తీసుకుని, పైకి కొంత పంపిస్తారు. ఇన్ని మోసాలు, దారుణాలు చేస్తున్న వారికి దేవుడు తప్పక బుద్ధి చెబుతాడు. తంతే ఎక్కడ పడతారో.. వాళ్లకూ తెలియదు.

వారిని చట్టం ముందు నిలబెడతాం
ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న వారెవ్వరినీ జగన్‌ 2.0లో మర్చిపోము. పక్కాగా డేటా బేస్‌ తయారు చేయ­మని మన లీగల్‌ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను. ఆ డేటా బేస్‌ ఆధారంగా వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం. త్వరలోనే ఒక యాప్‌ వస్తుంది. దాని తయారీలో సీనియర్‌ లాయర్లు కూడా పాలు పంచుకుంటున్నారు. 

⇒ రాష్ట్రంలో ఎక్కడ, ఏ వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు అన్యాయం జరిగినా.. ఆ యాప్‌ ఓపెన్‌ చేసుకుని, తన పూర్తి వివరాలు, తనకు జరిగిన అన్యాయం, అది ఎవరి వల్ల జరిగింది? దానికి సంబంధించి ఉన్న ఆధారాలు అప్‌లోడ్‌ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ మన డిజిటల్‌ లైబ్రరీలో నిక్షిప్తం అవుతుంది. రేపు మనం అధికారంలోకి రాగానే, ఆ డేటా ఓపెన్‌ చేసి చూస్తాం. ఇప్పుడు వేధిస్తున్న వారెవ్వరినీ వదలిపెట్టబోం. చట్టం ముందు నిలబెడతాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తాం. 

⇒ దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అందుకే లాయర్ల ద్వారా ఆ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో న్యాయవాదుల పాత్ర చాలా ముఖ్యం. పెద్దన్న మాదిరిగా లాయర్లు తోడుగా ఉండాలి. లాయర్ల సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement