డేట్‌ ఫిక్స్‌ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి | Ponguleti Srinivas Reddy challenges on KCR comments | Sakshi
Sakshi News home page

డేట్‌ ఫిక్స్‌ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Apr 28 2025 12:58 AM | Updated on Apr 28 2025 8:03 AM

Ponguleti Srinivas Reddy challenges on KCR comments

కేసీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్‌

బీఆర్‌ఎస్‌ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రులు జూపల్లి, పొన్నం, సీతక్క

సాక్షి, హైదరాబాద్‌: రజతోత్సవ సభ పేరుతో ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీపై ఆక్రోశంతో విషం కక్కారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుతాలు జరిగినట్టు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏమీ జరగనట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏం జరిగిందో..కాంగ్రెస్‌ టైంలో ఏం జరిగిందో చర్చించేందుకు సిద్ధం కావాలని చాలెంజ్‌ చేశారు. 

‘మీరు డేట్‌ ఫిక్స్‌ చేయండి. అసెంబ్లీకి రండి. మీరే సరి్టఫికెట్‌ ఇచ్చిన మీ బచ్చాగాళ్లతో మాట్లాడేది లేదు. మీరు రండి. మీ పాలనలో అద్భుతాలు, మీరు చేసిన ఘనకార్యాలను ప్రజలకు వివరిద్దాం. కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి కూడా మాట్లాడదాం. డేట్‌ మీరే చెప్పండి. చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు. 

ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్‌ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు తనను గద్దె దింపారనే ఆక్రోశంతో కేసీఆర్‌ మాట్లాడారని విమర్శించారు. కడుపునిండా కాంగ్రెస్‌ పార్టీపై విషం పెట్టుకొని మమ్మల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 

కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు విలన్‌ అయ్యిందో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్‌ అయ్యిందా? హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసినందుకు విలన్‌ అయ్యిందా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభలో తన హయాంలో జరిగిన మంచి పనులను చెప్పుకోవచ్చు.. అదేవిధంగా లోపాలను కూడా మాట్లాడి ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరన్నారు. 

రైతుల గుదిబండగా మారిన ధరణి పోర్టల్‌ గురించి, కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ సభలో కేసీఆర్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసలు కేసీఆర్‌ పెట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీసేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తామేదో బీఆర్‌ఎస్‌ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశామని చెబుతుంటే నవ్వు వస్తుందన్నారు. 

కేసీఆర్‌ అధికారంలో ఉండగా, కాంగ్రెస్‌ సభలకు బస్సులు ఇవ్వలేదని, టూవీలర్లు కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని,  కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారు ఎన్ని బస్సులకు డబ్బులు కడితే అన్ని బస్సులు ఇచ్చామని తెలిపారు. నిజంగా కాంగ్రెస్‌ అడ్డుకొని ఉంటే బీఆర్‌ఎస్‌ సభ జరిగేదా అని నిలదీశారు. తామేదో వర్సిటీ భూములు అమ్మినట్టు కేసీఆర్‌ చెప్పారని, ఏ యూనివర్సిటీ భూముల అమ్మామో ప్రజలకు చెప్పాలన్నారు. 

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును తనకు కావాల్సిన వారికి లీజుకు ఇచ్చుకుంది.. వైన్‌ షాపుల టెండర్లు ముగియక ముందే డబ్బులు వసూలు చేసుకుంది కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. తాము కమీషన్లు తీసుకున్నామని కేసీఆర్‌ అంటున్నారని, ఎక్కడ తీసుకున్నామో చూపించాలని డిమాండ్‌ చేశారు. ఏ కమీషన్లు తీసుకోకుండానే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ ఎలా ఎదిగిందని, రూ.1,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చబోమని కేసీఆర్‌ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన కూలిస్తే కూలిపోవడానికి ప్రభుత్వమేమైనా బొమ్మరిల్లా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన నాయకుడు... ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌ లేదన్నారు. 
 


తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదని, ఇప్పుడైనా ఆ పార్టీ శాసనసభ పక్ష పదవిని దళితుడికి ఇస్తారా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని బీసీకి ఇవ్వగలరా అని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై మాట్లాడేందుకు కేసీఆర్‌ డేట్‌ఫిక్స్‌ చేస్తే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించేందుకు సిద్ధం కావాలని మంత్రి పొంగులేటి బీఆర్‌ఎస్‌ నేతలను సవాల్‌ చేశారు.  

అధికారం పోయినా గర్వం పోలేదు: మంత్రి జూపల్లి  
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు ఉద్యోగం ఊడగొట్టినా కేసీఆర్‌కు గర్వం పోలేదని.. చింత చచ్చినా పులుపు చావనట్టు ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఒక్కో గ్రామానికి రూ. 3 లక్షలు ఖర్చు చేసి ఈ సభ నిర్వహించారని, ఆ డబ్బులు ఎక్కడివని నిలదీశారు. తాము కూడా రాజకీయాల్లోనే ఉన్నామని, తమకు ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నాడని, అసలు ఆయన ఉద్యోగం ఎందుకు ఊడిందో..ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాలని హితవు పలికారు.  

ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం  
కాంగ్రెస్‌ పార్టీని విలన్‌ అంటూ కేసీఆర్‌ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీనే లేకుంటే కేసీఆర్‌ మూడు చెరువుల నీళ్లు తాగినా, వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ఎల్కతుర్తి సభకు జనం రాకపోతే అదేదో తాము అడ్డుకున్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టి రాజకీయానికి బలైన ఉద్యమకారులు, అమరవీరులకు ఆ సభలో ఎందుకు నివాళులరి్పంచలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు.  

నియంత మాట్లాడినట్టుంది: మంత్రి సీతక్క  
మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక నియంత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టు కేసీఆర్‌ ప్రసంగం ఉందని చెప్పారు. అధికారం పోయాక కుటుంబం, ఆస్తులు చీలికలు,పీలికలు అయ్యాయన్న ఆవేదనతో ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ బిడ్డ మంచి కార్లలో తిరగొచ్చు గానీ.. పేద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తిరగవద్దా అని ప్రశ్నించారు. 

కేసీఆర్‌ అంత దరిద్రంగా పోలీసులను ఎవరూ ఉపయోగించుకోలేదని చెప్పారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్‌ తీసేశారని, ఇప్పుడు మళ్లీ తాము ధర్నాచౌక్‌ తెరిస్తే సిగ్గు లేకుండా అక్కడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారని చట్టసభను అవమానించిన కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే అర్హత ఉందా అని ప్రశ్నించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement