లైన్‌ క్లియర్‌.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట  | Madras High Court Dismisses PIL Challenging AIADMK Internal Election | Sakshi
Sakshi News home page

లైన్‌ క్లియర్‌.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట 

Dec 15 2021 7:35 AM | Updated on Dec 15 2021 9:49 AM

Madras High Court Dismisses PIL Challenging AIADMK Internal Election - Sakshi

పన్నీరు, పళని

సాక్షి, చెన్నై (తమిళనాడు): అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ మద్రాసు హైకోర్టులో తిరస్కరణకు గురైంది. దీంతో కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, కో–కన్వీనర్‌ పళని స్వామిలకు ఊరట లభించింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌ గెలుపుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ సైతం తిరస్కరణకు గురైంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కో–కన్వీనర్‌ ఎంపికకు ఈనెల మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియ సాగింది.

ఈ పదువులకు ఆ పార్టీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామిలు తప్పా, ఇతరులెవ్వరూ నామినేషన్లు వేయడానికి వీలు లేకుండా అన్నాడీఎంకే వర్గాలు ముందుకు సాగాయి. చిరవకు ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరడంతో ఆ ఇద్దరు నేతలు ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో హోసూరుకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు జయచంద్రన్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

నిబంధనలకు విరుద్ధంగా సంస్థాగత ప్రక్రియలు జరిగినట్టు, ఈ ఇద్దరి ఎంపికను ధ్రువీకరించకుండా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. వాదనల అనంతరం ఒక పార్టీకి సంబంధించి సంస్థాగత వ్యవహారాలు, ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చేందుకు తగ్గ జోక్యం కోర్టుకు లేదని పేర్కొంది. ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని తిరస్కరించింది. దీంతో పన్నీరు, పళని ఎన్నికకు లైన్‌ క్లియర్‌ అయింది. 

వానతీ శ్రీనివాసన్‌ గెలుపు 
బీజేపీ మహిళా విభాగం జాతీయ అ«ధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌పై ఆమె 1,600 ఓట్లతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ ఆ నియోజకవర్గంలో పోటీచేసిన స్వ తంత్ర అభ్యర్థి రాహుల్‌ గాంధీ మద్రాసు హైకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ మంగళవారం న్యాయమూర్తి భారతీ దాసన్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందు విచారణకు వచ్చింది. ఆధారాలు లేకపోవడం, ఇతర అభ్యర్థులు ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం వంటì అంశాలను పరిగణించిన కోర్టు పిటిషన్‌ విచారణను తిరస్కరించింది.  

చదవండి: వామ్మో.. లోదుస్తుల్లో బంగారం..

Advertisement
 
Advertisement
Advertisement