జవాబు చెప్పలేక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తెల్లమొహం వేశారు  | Legislative Affairs Minister Sridhar Babu comments on brs | Sakshi
Sakshi News home page

జవాబు చెప్పలేక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తెల్లమొహం వేశారు 

Dec 22 2023 4:42 AM | Updated on Dec 22 2023 4:42 AM

Legislative Affairs Minister Sridhar Babu comments on brs  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్ల పాలనలో అప్పులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జవాబు చెప్పలేక తెల్లమొహం వేశారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. రేషన్‌బియ్యం పంపిణీ మొదలుకొని రైతులకు మద్దతు ధర, విద్యావ్యవస్థ వంటి వాటిపై సభలో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపుపై సమాధానం చెప్పలేకపోయారన్నారు. గురువారం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు పూర్తిగా అందించాలనే ఉద్దేశంతో తాము రాష్ట్ర ఆర్థిక అంశాలు ప్రజల ముందు ఉంచామని తెలిపారు.

గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పాలన ఎలా సాగిందో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. శాసనసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు నిజమే అని తమ హయాంలో అప్పులు చేశామని, తాము ప్రభుత్వపరంగా చేసిన వ్యయం వల్ల ప్రయోజనాలు కలగలేదని వారు ఒప్పుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ పాలన కారణంగా రాష్ట్రంలోని ప్రతి యువకుడిపై రూ.7లక్షల అప్పు మోపారన్నారు. అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడుగులు వేస్తే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ హయాంలో పదేళ్లు పదవులు అనుభవించారని మండిపడ్డారు.

ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుచూపుతో విద్యుత్‌రంగంలో చర్యలు చేపట్టకపోతే ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 12 గంటల కరెంట్‌ ఇవ్వగలిగేది కాదన్నారు. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాల్లో లెక్కలు, తప్పులు అనేది అవాస్తవం...తేదీలు వెయ్యలేదు కాబట్టి కన్ఫ్యూజన్‌ ఏర్పడిందని ఆయన వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో పెట్టిన ప్రతి లెక్క వాస్తవం కావాలంటే స్పీకర్‌ ఆదేశంతో ప్రతీ సభ్యుడికి ఆ వివరాలు అందజేస్తామన్నారు.

శ్వేతపత్రం లెక్కలు ఎవ్వరినీ కించపరచడానికి కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, వ్యవసాయం, పరిశ్రమలు, డొమెస్టిక్‌ వినియోగదారులకు పూర్తి స్థాయిలో కరెంట్‌ ఇస్తామన్నారు. అప్పడు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏర్పడిన 36 రోజులకు అసెంబ్లీ సమావేశాలు పెట్టి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారని గుర్తుచేశారు. తాము మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజే అసెంబ్లీని సమావేశపరిచామన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement