పాయె.. ఇంకో హామీకి కూడా బాబు మంగళం! | KSR Counter to Chandrababu Naidu Fake Promises | Sakshi
Sakshi News home page

పాయె.. ఇంకో హామీకి కూడా బాబు మంగళం!

Dec 28 2024 12:56 PM | Updated on Dec 28 2024 1:07 PM

KSR Counter to Chandrababu Naidu Fake Promises

ఆంధ్రప్రదేశ్‌లో మరో వంచన పర్వానికి రంగం సిద్ధమైంది. తెలుగుదేశం అనుకూల పత్రిక ఈనాడులో వచ్చిన ఒక కథనం చూస్తే ఎవరికైనా ఈ అనుమానం రాకమానదు. ఆర్టీసీకి ఎన్నో సమస్యలున్నాయని చెప్పే ఈ కథనాన్ని బట్టి చూస్తే.. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణం హామీ ఇక అమలు జరగదనే అనిపిస్తుంది. జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోలోని 25 హామీల్లో ఇది ‍ప్రముఖమైంది. తెలంగాణలో ఎన్నికల హామీకి తగ్గట్టుగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్‌ ప్రయాణాన్ని అమలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏడు నెలలవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాష్ట్రంలోని మహిళలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం సహా కూటమి పార్టీలన్నీ వాగ్ధానాల అమలుపై నానా రచ్చ చేసేవి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చినా ప్రతిపక్షాలు దాని అనుకూల మీడియా నానా వంకలూ పెట్టేవి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేసేవి. ఇప్పుడు మాత్రం.. ఇచ్చిన ఆరంటే ఆరు హామీలకూ మంగళం పాడుతున్నా ఈనాడు, ఆంధ్రజ్యోతులకు గొంతు పెగలడం లేదు. పైపెచ్చూ జగన్‌ కారణంగా ఇప్పుడు చంద్రబాబు హామీలను నెరవేర్చలేకపోతున్నారన్న కలరింగ్‌ ఒకటి! ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రజలను మోసం చేశారు అనకుండా.. వారిపై జనాల్లో సానుభూతి పెంచేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చిన హామీల్లో వృద్ధాప్య ఫించన్ల మొత్తం పెంపు ఒక్కటే ప్రస్తుతానికి అమలైన హామీగా కనిపిస్తోంది. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు పరిమితి పెట్టారు. 

ఇస్తామన్న మూడూ ఎంతమందికి అందుతోందన్న స్పష్టత లేదు. దీన్ని అమలు చేశారని అనుకున్నప్పటికీ మిగిలిన వాటి సంగతేమిటి? రాష్ట్రం పరిస్థితి చూస్తూంటే  భయమేస్తోందని అనడంతోనే చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రింబవళ్లూ ఆలోచిస్తున్నా ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని పచ్చమీడియా తన బొంకులతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు మాటల్లోని డొల్లతనం ఏమిటన్నది ఈ మాటలతోనే స్పష్టమైపోతోంది కదా?ఎన్నికలకు ముందు... జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు వార్తలు సృష్టించారు. సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని బడాయికి పోయారు. మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కూడా. తీరా అధికారం చేతికొచ్చిన తరువాత చేసిందేమిటి? జగన్‌ చేసిన అప్పులు బాబు చెప్పిన సంఖ్యలో సగమేనని స్పష్టమైంది. 

పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ రూ.70 వేల కోట్ల అప్పూ చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ఇంకో రూ.15 వేల కోట్ల భారం ప్రజల నెత్తిన రుద్దారు. ఇంతింత అప్పులెందుకు అని అడిగితే మాత్రం విషాద రాగం ఎత్తుకుంటారు బాబుగారు. ఈ క్రమంలోనే తాజాగా మహిళల ఉచిత బస్ ప్రయాణం హామీకి మంగళం పలకడమో, తూతూ మంత్రంగా అమలు చేయడమో చేసేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మంత్రివర్గ ఉప సంఘం, ఆ తర్వాత అధికారిక కమిటీలతో నివేదికలు తయారు చేయిస్తున్నారు. ఈనాడు కథనం ప్రకారం ఉచిత బస్ స్కీమ్ అమలుకు 2000 బస్సులు కావాలి. ఇప్పుడున్న వారికి తోడు మరో 11500 మంది సిబ్బంది అవసరం. మహిళా ప్రయాణికుల సంఖ్య పది లక్షలు పైగా పెరుగుతుందని. ఆర్టీసికి నెలకు రూ.ఆరు కోట్ల నష్టం రావచ్చని అధికారులు అంచనా వేశారని రాసుకొచ్చింది ఈనాడు! అన్ని కలిపి ప్రభుత్వానికి నెలకు రూ.200 కోట్లు, ఏటా రూ.2400 కోట్లూ నష్టమని లెక్కకట్టారు.

ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది జీతాలపై నెలకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి విలీనం చేసిన తరువాత కూడా జీతాలు ఈ స్థాయిలో ఎందుకున్నాయో ఎల్లో మీడియా చెప్పడం లేదు. అదనపు సిబ్బంది పేరు చెప్పి.. వీరి నియామకానికి సమయం పడుతుందని.. వీరి జీతభత్యాలు అదనమని చెప్పేందుకు ఈనాడు తన కథనం ద్వారా ప్రయత్నిస్తోందన్నమాట. అయితే.. రాజకీయాల్లో తనది 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే చంద్రబాబుకు హామీ ఇచ్చే నాటికి ఈ విషయాలన్నీ తెలియవని అనుకోవాలా? అంటే.. గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు ఇచ్చారనేగా అర్థం ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేస్తే తీవ్రంగా నష్టపోయేది ఆటోవారు. కాబట్టి వీరికి పరిహారం సంగతి కూడా చూడాల్సి ఉంటుంది. 

తెలంగాణలో కొన్ని లోటుపాట్లతో ఈ పథకం అమల్లో ఉంది. కొత్త బస్సులు కొనలేదు.. అదనపు సిబ్బంది నియామకమూ జరగలేదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. ఎగొట్టడానికే అన్నది సామాన్యుడిని అడిగినా వచ్చే సమాధానం. చంద్రబాబు ఎన్నికల హామీల అమలుకు ఏటా రూ.1.5 లక్షల కోట్లు కావాలని వైసీపీ ఎప్పుడో స్పష్టం చేసినా టీడీపీ తమకు అనుభవముందని చెప్పేవాళ్లు. అచ్చంగా 2014లో రైతు రుణమాఫీ హామీ మాదిరిగా అన్నమాట! అప్పట్లో  బాబు తాకట్టులో ఉన్న  రైతుల భార్యల బంగారాన్ని కూడా విడిపిస్తానని పదే, పదే ప్రచారం చేశారు. దానిని రైతులు చాలా మంది నమ్మి ఓట్లు వేశారు.

ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు  చూపెట్టింది. రకరకాల కండిషన్లు పెట్టడం, సర్టిఫికెట్ల పేరుతో ఆఫీస్‌ల చుట్టూ తిప్పడం వంటి ఇబ్బందులు పడ్డారు. అయినా రుణమాఫీ కేవలం రూ.15 వేల కోట్ల మేరే చేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వం రుణమాఫీ కొనసాగించాలని కూడా టీడీపీ డిమాండ్ చేసేది. 2024లో  మళ్లీ చంద్రబాబు  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆనాటి రుణమాఫీ బాకీల గురించి మాట్లాడడం లేదు. 

 ఇప్పుడు తాజాగా ఇచ్చిన హామీలకే దిక్కు లేకపోతే పాత రుణమాఫీ బాకీ గురించి రైతులు అడిగే ప్రశ్న రాదు. ఈ సారి ఇచ్చిన రైతుల పెట్టుబడి సాయం రూ.20 వేలు హామీ ఎప్పుడు నెరవేర్చేది చెప్పడం లేదు. ఈ దశలో ఒక్కో హామీకి సంబంధించి ఇబ్బందులపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించి దాటవేయడానికి ప్రయత్నాలు ఆరంభం అయినట్లు అర్ధం చేసుకోవచ్చు. అందులో భాగంగానే మహిళల ఉచిత బస్ హామీకి గుడ్ బై చెప్పడానికి లేదా, గతంలో  రుణమాఫీ మాదిరి అరకొరగా చేయడానికి ఒక ప్రాతిపదికను  తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
 
Advertisement
Advertisement