ధనవంతులకు ఉపయోగపడేలా ఎయిర్‌పోర్టులు కట్టాను: చంద్రబాబు | Sakshi
Sakshi News home page

ధనవంతులకు ఉపయోగపడేలా ఎయిర్‌పోర్టులు కట్టాను: చంద్రబాబు

Published Sat, May 13 2023 7:08 AM

Chandrababu Says I Built Airports For The Use Of Rich People - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు రూరల్‌: సమస్యలు చెప్పుకోవడానికి రైతులు తన వద్దకు వస్తుంటే రాకుండా అడ్డుకుని భయపెడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి తాను వస్తుంటే.. రైతులను రానీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శుక్రవారం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న­ప్పుడు ఎయిర్‌పోర్టులు, పోర్టులు అభివృద్ధి చేసి ధనవంతులకు బాగా ఉపయోగపడ్డానని గుర్తు చేశారు.

మళ్లీ ముఖ్యమంత్రి అయితే కోస్తాలో ఆక్వా కల్చర్, రాయలసీమలో హార్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఆక్వా జోన్‌ పరిమితి లేకుండా ఆక్వా సాగుదారులందరికీ రూ.1.50కే కరెంట్‌ ఇస్తానని తెలిపారు. రాష్ట్రంలో రైస్‌ మిల్లర్లు దళారులుగా మారారని ధ్వజమెత్తారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతుంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. పరిహారం ఇవ్వాలని అడిగినా అసమర్థ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
చదవండి: ‘వరం’ పోయిందని కడుపు మంట

సంక్షోభంలో ఉన్న రైతులను పరామర్శించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రతి ఎకరాకూ రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టం వస్తుందని చెబుతుంటే తన మీద విమర్శలు, ప్రతిదాడి చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి తాను 72 గంటల సమయం ఇచ్చినా రైతుల సమస్య పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున పోరాడతానని చెప్పారు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని వెల్లడించారు. 

Advertisement
Advertisement