ఎన్నికలే ముఖ్యమా రేవంత్‌.. SLBC వద్దకెళ్లే తీరక లేదా?: కేటీఆర్‌ | BRS MLA KTR Sensational comments On CM Revanth | Sakshi
Sakshi News home page

ఎన్నికలే ముఖ్యమా రేవంత్‌.. SLBC వద్దకెళ్లే తీరక లేదా?: కేటీఆర్‌

Feb 24 2025 11:47 AM | Updated on Feb 24 2025 1:14 PM

BRS MLA KTR Sensational comments On CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ(SLBC) టన్నెల్‌ ​ప్రమాదంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఈ క్రమంలో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో  ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా? అని ప్రశ్నించారు. సహాయక చర్యలు కొల్లికి రాకముందే వారు బతికుండే అవకాశమే లేదనడం సర్కార్‌ చేతులెత్తేసిన తీరును నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై కేటీఆర్‌(KTR) ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌..‘టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది ఆచూకీ తెలియని ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం దిగజారుడు రాజకీయమే. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్‌నెస్‌ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుంది?. రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతుంది?.

ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్తనాదాలతో మిన్నంటుతున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు వెళ్లే సమయం లేదా?. ఇందిరమ్మ రాజ్యంలో  ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా?. ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా?. ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తున్న తీరు, మరోవైపు సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే మా తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రి!! సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా?.

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యుయేట్స్‌కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెడతారు. జై తెలంగాణ అంటూ’ కామెంట్స్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement