
సాక్షి,విజయవాడ: ఏపీలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని.. వంచన ప్రభుత్వం అని మండిపడ్డారు శాసనమండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ. తల్లికి వందనంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
తల్లికి వందనం కాదు.. వంచన. మొత్తం పిల్లలు 87,41,885, ఇస్తామంటున్నది 67,27,164 మందికి, కాని ప్రకటించిన నిధులు ప్రకారం చూస్తే 58 లక్షల మందికే. అదికూడా పూర్తిగా ఇస్తారో లేదో?. దాదాపుగా 29 లక్షల మంది పిల్లలకు మోసమే కదా?. పథకం అమలుకు కావాల్సింది ఏడాదికి రూ.13,050 కోట్లు. గత ఏడాది పూర్తిగా ఎగనామం, రెండేళ్లకు ఇవ్వాల్సింది రూ.26,100 కోట్లు. ఈ ఏడాది రూ.8,745 కోట్లు ఇస్తామని ప్రకటన. ఇది వంచన కాదా?
ఎన్నిలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలకు హామీలుఇచ్చి, వాటిని అమలు చేయకుండా ఏడాదికాలంపాటు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అరాచకంగా పరిపాలన చేసింది. ఏడాది పాలన తర్వాతకూడా, చేసిన వాగ్దానాలను అమలు చేయాలనే చిత్తశుద్ధి కనిపించడంలేదు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తల్లికి వందనం అమలు చేసేస్తున్నామంటూ కూటమి ప్రభుత్వం జారీచేసిన ప్రకటన చూస్తే ప్రజలను ఏరకంగా వంచిస్తున్నారో అర్థం అవుతోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం, ప్రతిఏటా క్రమం తప్పకుండా అమలవుతుంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపథకాన్ని రద్దుచేసి గత విద్యాసంవత్సరంలో తల్లులకు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు.
రాష్ట్రలో మొత్తంగా ఉన్న పిల్లలు 87,41,885, కాని ప్రభుత్వం 67,27,164 మంది మాత్రమే ఇస్తామంటోంది. తీరా ప్రకటించిన డబ్బులు చూస్తే కేవలం 58 లక్షల మందికే. ఇది మోసం కాదా? వంచన కాదా?
యూడీఐఎస్ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒకటో తరగతినుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న విద్యార్థులు దాదాపుగా 87,41,885 మంది ఉన్నారు. చంద్రబాబునాయుడుగారు తన మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. దీని ప్రకారం మొత్తంగా ఏడాదికి ఇవ్వాల్సింది రూ.13,050 కోట్లు. గత ఏడాది ఒక్కపైసా ఇవ్వలేదు.
గత ఏడాది బకాయిలతో కలిపి ఈ ఏడాది చెల్లించాల్సింది రూ.26,100 కోట్లు. కాని, ఈ ఏడాది రూ.8,745 కోట్లు మాత్రమే ఇస్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇస్తే, ఈ డబ్బులు కూడా సంపూర్ణంగా ఇస్తే కేవలం 58లక్షల మందికే సరిపోతాయి. అంటే 29 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెడుతున్నట్టేగా?
మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో ప్రాంతం, మతం, కులం, పార్టీలు చూడకుండా అందరికీ పథకాన్ని వర్తింప చేస్తే, ఈ ప్రభుత్వం 67,27,164 మంది విద్యార్థులకు మాత్రమే పథకాన్ని వర్తింపుచేస్తామని విద్యాశాఖమంత్రి చెప్తున్నారు. ఇది చాలా దారుణం. అలా చూసినాసరే ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున రూ.10,090.75 కోట్లు ఇవ్వాలి, కాని రూ.8,745 కోట్లు మాత్రమే ప్రకటించడం చూస్తే ఇది మోసమే అని తేలిపోయింది.
ఈ అంకెలు చూస్తే ఏదోరకంగా మభ్యపెట్టేలా ప్రభుత్వ ధోరణి కనిపిస్తోంది. ఇది మహిళలను మోసం చేస్తున్నట్టు కాదా? తల్లులను వంచిస్తున్నట్టు కాదా? తల్లికి వందనం కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న వంచన ఇది’ అని దుయ్యబట్టారు.