ఉత్తర బెంగాల్పై బీజేపీ, తృణముల్ ఫోకస్
కీలకంగా మారిన 54 స్థానాలు
పశ్చిమబెంగాల్లో ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నడుమ సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు అచ్చం దంగల్ కుస్తీ పోటీలను తలదన్నుతోంది. ఒకటి కేంద్రంలో, మరొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పారీ్టలు కావడంతో ఈ ఎన్నికలను రెండు పక్షాలూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అసెంబ్లీ బరిలో ఇప్పటికే విజయాల హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా క్రమంగా విస్తరిస్తూ వస్తున్న కాషాయ దళం ఈసారి టీఎంసీని ఎలాగైనా ఓడించి తొలిసారి అధికారాన్ని ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. ఆ క్రమంలో కీలకమైన ఉత్తర బెంగాల్ ప్రాంతంపై 2 పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. తనకిప్పటికే పట్టున్న ఈ ప్రాంతాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ తలమునకలుగా ఉంది. పలు ప్రాంతీయ హామీలతో ఉత్తర బెంగాల్వాసులను ఆకట్టుకునేందుకు, ఆదరణ పెంచుకునేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోంది.
నువ్వా, నేనా!
బీజేపీ, టీఎంసీ ఎన్నికల పోరుకు ఉత్తర బెంగాల్ ప్రాంతం కీలకంగా మారింది. ఇక్కడ 54 అసెంబ్లీ సీట్లపై రెండు పారీ్టలూ గట్టిగా దృష్టి పెట్టాయి. ఒకప్పుడు కొరకరాని కొయ్యగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీలో కొన్నేళ్లుగా బలపడుతూ వస్తోంది. ఆ పట్టును ఈసారి మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా ఉత్తర బెంగాల్పై బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా దృష్టి పెట్టింది. ఈసారి ఇక్కడ కనీసం 40 అసెంబ్లీ స్థానాలకు పైగా గెలిపించే బాధ్యతలను పార్టీ బెంగాల్ ఇన్చార్జి సునీల్ బన్సర్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు అప్పగించింది. వారు ఇటీవలే ముఖ్య స్థానిక నేతలతో కీలక సమావేశం నిర్వహించి సమగ్ర ప్రచార వ్యూహం సిద్ధం చేశారు. అందులో భాగంగా మూడంచెల ప్రచార పర్వానికి బీజేపీ తెర తీసింది. ఉత్తర బెంగాల్కు తృణమూల్కు అన్నివిధాలా ద్రోహం చేస్తోందంటూ హోరెత్తిస్తోంది. 15 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తోందని ఆరోపణలు గుప్పిస్తోంది.
‘సరికొత్త ఉత్తర బెంగాల్’ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటింటి ప్రచారంతో దూకుడు పెంచుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఉత్తర బెంగాల్కు దీదీ కేవలం 0.002 శాతం నిధులు విదిలించారన్న బీజేపీ ఆరోపణలు ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. బాగ్డోగ్రా విమానాశ్రయ విస్తరణలో భూమి కోల్పోనున్న రైతులు, కార్మిక సంస్కరణల పేరిట తేయాకు పనివారికి అన్యాయం తదితరాలను కూడా బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కూడా అప్రమత్తమైంది. ఉత్తర బెంగాల్లో అధిక సంఖ్యలో ఉండే తేయాకు కారి్మకుల సంక్షేమానికి ఇప్పటికే పలు హామీలిచి్చంది. ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తామని పేర్కొంది. రైతులకు ఎలాంటి అన్యాయమూ జరగకుండా చూసుకునే బాధ్యత మమతదేనంటూ టీఎంసీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బెంగాలీ అస్తిత్వ నినాదాన్ని ప్రధానంగా ముందుకు తెస్తున్నారు.
ఎందుకు కీలకం..
ఉత్తర బెంగాల్ గిరిజనులు, మైనారిటీ ప్రాబల్య ప్రాంతం. ఇది చారిత్రకంగా తృణమూల్కు పెద్దగా పట్టు లేని ప్రాంతమనే చెప్పాలి. తొలినుంచీ ఇక్కడ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. అవి బలహీనపడ్డాక కొన్నేళ్లుగా వాటి స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తూ వస్తోంది. ఇక్కడి డార్జిలింగ్, కూచ్ బెహార్, జల్పాయ్గురి, దినాజ్పూర్ ప్రాంతాల్లో బీజేపీ హవా క్రమంగా పెరుగుతూ వస్తోంది. డార్జిలింగ్ లోక్సభ స్థానాన్ని 2009 నుంచీ బీజేపీయే నెగ్గుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఇక్కడ 25 స్థానాలు నెగ్గితే బీజేపీ కేవలం మూడింటితోనే సరిపెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఉత్తర బెంగాల్లోని 8 సీట్లకుగాను బీజేపీ ఏడింటిని చేజిక్కించుకుంది. అదే ఊపులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకంగా 30 సీట్లు ఒడిసిపట్టింది. తృణమూల్ 24 సీట్లతో సరిపెట్టుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 6 స్థానాలు నెగ్గింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


