సాక్షి, తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో సీబీఐ రిపోర్ట్ తర్వాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైఎస్సార్సీపీ నేతలపై ఆయన దాడులు చేయిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అంటున్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఎన్డీడీబీ(National Dairy Development Board) ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మాట్లాడానని చంద్రబాబు అంటున్నారు. కానీ, ఎన్డీడీబీని టీటీడీకి పరిచయం చేసిందే వైఎస్ జగన్ ప్రభుత్వం. సీబీఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసే అవకాశమే లేదని తేల్చింది. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ(National Dairy Research Institute) రిపోర్టులను ఉటంకిస్తూ సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది.
చంద్రబాబు హయాంలోనే భోలే బాబా డైరీ నుంచి టీటీడీ నెయ్యిని కొనుగోలు చేసింది. 2018లో భోలే బాబా కంపెనీ పేరు హర్ష్ ప్రెష్ డెయిరీ. అక్కడి నుంచి కేజీ నెయ్యిని రూ.291కి కొనుగోలు చేశారు. ఇదే విషయాన్ని సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది. మేం అధికారంలోకి వచ్చాక భోలే బాబాను డిస్క్వాలిఫై చేశాం.
అయినా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2025 సెప్టెంబర్ 23న చంద్రబాబు వ్యాఖ్యలకు శ్యామలరావు(మాజీ ఈవో) వంత పాడారు. కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న చంద్రబాబే సిట్ను నియమిస్తే.. ఆ సిట్ అధికారుల్ని మేం ఎలా నమ్మేది?. సరైన విచారణ జరిపే సుప్రీం కోర్టు నియమించే అధికారులే కావాలి.
సీబీఐ రిపోర్ట్ తర్వాత చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. అందుకే పక్కా ప్రణాళికతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు అంబటి క్షమాపణలు చెప్పినా దాడులు చేశారు. తప్పుగా మాట్లాడానని అంబటి క్షమాపణలు కూడా కోరారు. అంబటి ఇంటి మీదకు 3,000 మందితో కూడిన రౌడీ మూకను పంపించారు. జోగి రమేష్ ఇంటిపై కూడా ఉద్దేశపూర్వకంగానే దాడి చేయించారు. అంబటి, జోగి రమేష్ ఇళ్లపై అసాంఘిక శక్తులతో దాడులు చేయించారు’’ అని భూమన అన్నారు.


