
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకునే నేతలు గాంధీభవన్కు క్యూ కడుతున్నారు. బీఫారం కోసం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడంతో.. ఆ పార్టీ తరపున పోటీ చేయాలనుకునే నాయకులు గాంధీభవన్ను చుట్టుముడుతున్నారు. దరఖాస్తులు ఇచ్చి వెళ్తున్నారు.
ఈనెల 18న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ 25వ తేదీన ముగియనుండగా, మంగళవారానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 300కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఆమె భర్త శ్యాంనాయక్,
కరీంనగర్ అసెంబ్లీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, పార్టీ ఉపాధ్యక్షుడు కుమార్రావు తదితరులు.. దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.