Andhra Pradesh: YSRCP MP Margani Bharat Slams Ashok Gajapathi Raju, Details Inside - Sakshi
Sakshi News home page

‘అశోక విలాపం’ ఇప్పుడెందుకు.. ఇన్నాళ్లకు నిద్రలేచి నిందలు వేస్తారా?

Mar 8 2023 6:51 PM | Updated on Mar 8 2023 7:57 PM

Andhra Pradesh: Ysrcp Mp Margani Bharat Slams Ashok Gajapathi Raju - Sakshi

సాక్షి,రాజమండ్రి(తూర్పు గోదావరి): 'మీరు అధికారంలో ఉన్నారు.. కేంద్ర మంత్రిగా పనిచేశారు.. అప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు.. ఇన్నాళ్ళ తరువాత నిద్రలేచి నిందలు వేస్తారా అశోక్ గజపతి రాజు గారూ..' అంటూ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సూటిగా ప్రశ్నించారు.  వైసీపీ ఎంపీల పనితీరు బాగోలేదని అశోక గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను ఎంపీ భరత్ దృష్టికి పలువురు విలేకరులు తీసుకువచ్చారు. 

ఈ అంశంపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక గజపతి రాజు కేంద్ర మంత్రి కదా.. కేబినెట్‌లో ప్రత్యేక హోదా ఇవ్వం.. స్పెషల్ ప్యాకేజీ ఇస్తాం అన్నప్పుడు ఈ మంత్రి గారు నిద్రపోయారా’ అని ప్రశ్నించారు. ఆ ముంపు మండలాలు ఇస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్న చంద్రబాబు ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే సీఎంగా ప్రమాణం, సంతకం చేస్తానంటే అప్పుడే వచ్చేది కదా' అన్నారు. టీడీపీ చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆనాడే ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీఏ నుండి బయటకు వస్తే.. రాష్ట్రానికి ఈ ఖర్మ ఉండేది కాదన్నారు. మేము అప్పటి టీడీపీ ఎంపీల్లా సన్నాయి నొక్కులు నొక్కడం లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వాన్ని మొహమాటం లేకుండా నిలదీస్తూనే ఉన్నామన్నారు.

ఉత్తర కుమారా..లోకేష్ నీకతేంది?
ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్న ఉత్తర కుమారా.. లోకేష్ అసలు నీ కతేందీ.. ధరలు పెరిగాయని ఈ గందర గోళం ఏమిటని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అసలు నీ భాష ఏంటో, నీ బాధ ఏంటో మాకు సరే.. నీ కూడా తిరిగే వారికే అర్థం కాదన్నారు. యువగళమా అది గందరగోళమో అర్థం కావడం లేదన్నారు. నీ కుటుంబ సభ్యులకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు అయినా బూతులు రాకుండా చూసుకో.. మొన్నా మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హల్చల్ అవుతుంటే చూస్తే.. ఏందిరా బాబూ.. ఆ అక్షరాలు దిద్దించడం.. అసలు ఫస్ట్ నువ్వు అక్షరాలు నేర్చుకో అంటూ హితబోధ చేశారు. కాపురం చూస్తే తెలంగాణాలో.. రాజకీయ డ్రామాలు ఆంధ్రప్రదేశ్ లోనా, మీలాంటి వారి చేతిలో ఎలా ఈ రాష్ట్రాన్ని పెడతారని అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో ప్రజలు చాలా విజ్ఞులని, గతంలో చేసిన మీ పాలన చూశాక మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తారని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు.

నేనెప్పుడూ..సూపర్ స్టార్ నే
ఎంపీ రఘురామ రాజు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్ స్పందించారు. నేను ఏక చిత్ర నటుడినైనా.. హీరోనే.. చేయాలనుకుంటే ఎన్ని సినిమాలోనైనా హీరోగా నటిస్తా, ప్రజలను మెప్పిస్తా.‌. సూపర్ స్టార్ అనిపించుకుంటా అన్నారు. నీకూ ఒక కామెడీ క్యారెక్టర్ ఇప్పిస్తా.‌.గోచీ పెట్టుకుంటావు కదా అంటూ ఎద్దేవా చేశారు. అరటి ఆకు స్టోరీ.. పార్లమెంటరీలో అందరూ నవ్వుకున్నారు.. నోరు అదుపులో పెట్టుకో రఘూ అంటూ ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అభివృద్ధిని స్వాగతించండి..
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రూ.13లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చాయని, ఇవి చూసి ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని ఎంపీ భరత్ వ్యాఖ్యానించారు. రాయలవారి కొలువులో అష్ట దిగ్గజాల మాదిరిగా దేశ విదేశాల నుండి ఎందరో పారిశ్రామిక దిగ్గజాలు వస్తే..అభినందించడం పోయి దీనికి కూడా వారి సహజసిద్ధమైన విమర్శలు చేయడం ప్రతిపక్షాల నైజాం బయటపడిందన్నారు. ఆరోగ్యకరమైన విమర్శలు ప్రగతికి దోహదపడతాయి కానీ..ఇలా ప్రతీ దానికీ విమర్శిస్తే ప్రజల్లో నవ్వులపాలవుతారని ఎంపీ భరత్ అన్నారు.

చదవండి: నాడు కూలీ... నేడు ఓనర్‌! కాదేది అతివకు అసాధ్యం

Advertisement
 
Advertisement
Advertisement