గుజరాత్‌ ఫలితాలతో కొత్త శకం ప్రారంభం అయ్యింది : కేజ్రివాల్‌

125 Year Old Congress Defeated : Kejriwal On AAP Victory In Gujarat - Sakshi

న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన గుజరాత్‌ స్థానిక ఎన్నికల ఫలితాలతో కొత్త శకం ఆరంభం అయ్యిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు. ఆమ్ అడ్మి పార్టీ (ఆప్)కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సూరత్‌ ప్రజలు 125 ఏళ్ల చరిత్ర ఉన్నకాంగ్రెస్‌ను ఓడించారని, ప్రజల భాగస్వామ్యంతో గుజరాత్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, తమ పార్టీ అభ్యర్థులు ఎంతో నిజాయితీతో, నిబద్ధతతో పని చేస్తారని మాటిస్తున్నట్లు తెలిపారు. తమకు ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రజలను నేరుగా కలిసేందుకు ఈనెల 26న సూరత్‌లో పర్యటిస్తామని కేజ్రివాల్‌ పేర్కొన్నారు. 

కాగా ఆదివారం గుజరాత్‌లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఎన్నికలు జరగగా, వాటిలో 483 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, కాంగ్రెస్‌ 55 సీట్లు మాత్రమే గెలుపొందింది. అయితే 120 వార్డులు ఉన్నసూరత్‌ కార్పొరేషన్‌లో బీజేపీ 93 గెలవగా  కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు.  తొలి సారి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సూరత్‌లో 27 స్థానాలు గెలుచుకుని, ఆ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.  ఈ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. సూరత్‌లో పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన పాటిదార్ అనామత్ ఆరాక్షన్ సమితి (పిఎఎఎస్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బహిష్కరించింది. దీనిని అవకాశంగా మరల్చుకున్న ఆప్‌..వారి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టిక్కెట్లు ఇచ్చి కాంగ్రెస్‌ను ఢీ కొట్టింది. ఫలితంగా సూరత్‌లో ఆప్‌ అనూహ్య రీతిలో విజయం సాధించింది. మరోవైపు ఆప్‌ విజయంతో రాష్ట్ర బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్  పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే పాటిల్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి : (80 ఏళ్ల వృద్ధుడికి.. రూ.80 కోట్ల కరెంట్‌ బిల్లు)
(ఆ ఆటో డ్రైవర్‌కు నెటిజన్లు ఫిదా : భారీ విరాళాలు)

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top