
ఏసీబీ దూకుడు..!
● వరుస కేసులతో హడలెత్తిస్తున్న అనిశా ● సుప్తావస్త వీడి దాడులు మొదలుపెట్టిన వైనం ● ఏసీబీ డీజీ అక్షింతలతో చురుగ్గా కేసుల నమోదు ● కాళేశ్వరం ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా నిఘా ● రెండు నెలలుగా ఏసీబీకి పెరిగిన ఫిర్యాదులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
అవినీతి నిరోధక శాఖ నిద్రలేచింది. ఇంతకాలం సుప్తావస్థలో ఉన్న డిపార్ట్మెంట్.. ఏసీబీ డీ జీగా విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టాక చురుగ్గా కదులుతోంది. ఇటీవల కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్ ఇంటిపై దాడులు చేసి రూ.100 కోట్ల వరకు ఆస్తులు గుర్తించి తన మార్క్ చాటుకుంది. తాజాగా కరీంనగర్ జెడ్పీ కార్యాలయంలోనూ బిల్లుల కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దాడులతో ఏసీబీ తిరిగి పూర్వపు తరహాలో దాడులు చేస్తోందన్న సంకేతాలు ఇచ్చింది. వాస్తవానికి మూడేళ్లుగా కరీంనగర్ ఏసీబీ విభాగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎలాంటి కేసులు నమోదు కాకున్నా.. ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడం తెలిసిందే. అదే సమయంలో స్థానికంగా కరీంనగర్ బల్దియా, రెవెన్యూ విభాగాల్లో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా.. సదరెం వంటి స్కాంల విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. ఏసీబీ పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా ఎవరినీ వదలడం లేదు.
ఏసీబీ డీజీ రాకతో..
2020, 2021లో కరోనా కారణంగా దూకుడు తగ్గిందనుకున్నా.. 2022, 2023, 2024లో చరుకుదనం తగ్గడంలో ఆంతర్యం ఏమిటో అర్థంకాలేదు. గతేడాది ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరీంనగర్ ఏసీబీలో కాస్త కదలిక వచ్చింది. 2024 నవంబరులో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ (పీవోపీ) సందర్భంగా కరీంనగర్కు వచ్చిన విజయ్కుమార్.. ఇక్కడి ఏసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ఏసీబీ నమోదు చేసిన కేసులు చూసి కంగుతిన్నారని సమాచారం. అసలేం చేస్తున్నారు..? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతి లేనేలేదా..? అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అప్పటికపుడు నిద్రలేచిన అధికారులు వేట మొదలుపెట్టారు. అప్పటి నుంచి కేసుల విషయంలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే పలువురు ఇంజినీర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఇటీవల ఏసీబీకి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వారి ఆస్తుల జాబితా తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
రెవెన్యూ విభాగంలోనే అధికం
2019 నుంచి 2025 వరకు ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో ఎప్పటిలాగే రెవెన్యూ విభాగం ముందు వరసలో ఉంది. ఏటా నమోదయ్యే కేసుల్లో ఈ శాఖకు సంబంధించినవే ఉండటం గమనార్హం. 2019లో ఆరు, 2022లో ఆరు, 2023లో నాలుగు, 2024లో ఐదు, 2025లో మూడు కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 2020, 2021లో కరోనాతో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది. ఫలితంగా రెవెన్యూకు సంబంధించి ఆ రెండేళ్లలో ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. ప్రస్తుతం సిబ్బంది కొరత వేధిస్తున్నా.. కేసుల వేటలో వేగం పెంచడం శుభపరిణామం.
ఫిర్యాదులు పెరిగాయి
రెండు నెలలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఫిర్యాదులు పెరిగాయి. కేసులు విషయంలో దూకుడుగా ఉన్నాం. 1064 టోల్ఫ్రీ నంబరు, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ వేదికగా బాధితులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరికీ డబ్బులు చెల్లించాల్సి న అవసరం లేదు. అధికారులు లంచం అడిగితే వెంటనే మా ఫోన్ నంబర్ 91543 88954కు ఫిర్యాదు చేయండి.
– విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ

ఏసీబీ దూకుడు..!

ఏసీబీ దూకుడు..!